ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఒకపక్క ప్రధాన పార్టీల నాయకులు ప్రజలలో మమేకమవుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధం కాబోతున్న క్రమంలో మరోపక్క అధికార పార్టీ అధినేత చంద్రబాబు ఒకపక్క పాలన కొనసాగిస్తూనే మరోపక్క తనదైన శైలిలో ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోయేలా వ్యూహాలు పన్నుతున్నారు.
ఈ క్రమంలో ఇటీవల జన్మభూమి మా ఊరు కార్యక్రమం లో టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామసభలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు రానున్నాయని.. వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుందని ఆయన అన్నారు.
ప్రకాశం జిల్లాలో వివిధ సంస్థలు రూ.24,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్లు వస్తోందని, దీని ద్వారా ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి కలగనుందని చెప్పారు.
50వేల మంది రైతులకు దీంతో ప్రయోజనం కలగనుందని ఆయన వివరించారు. మొత్తంమీద ఎన్నికల ముందు చంద్రబాబు అటు ప్రభుత్వ కార్యక్రమాలలో ను ఇటు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ముందుకు దూసుకుపోతున్నారు.