తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీ తన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని మళ్లీ ఉపయోగిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే రాష్ట్రంలో టీడీపీ ని ఖాళి చేయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ రెండు స్థానాలను దక్కించుకుంది. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్రా వెంకట వీరయ్య, అశ్వారావు పేట నియోజకవర్గం నుంచి మచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరపున విజయం సాధించారు.
అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. గత అసెంబ్లీలో మాదిరిగా ఈసారి కూడా టీడీపీ శాసన సభా పక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేసేలా టీఆర్ ఎస్ ఛీఫ్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి కార్పోరేషన్ పదవులు ఇచ్చేందుకు అధికార పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టాలని టీఆర్ ఎస్ భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ ఎస్ మిగిలిన పార్టీల వారికి గాలం వేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ 88స్థానాలను దక్కించుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్ ల చేరికతో ఆ సంఖ్య 90 కి చేరింది. ఇక టీడీపీ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని తమ బలాన్ని సెంచరీకి పెంచుకోవాలని అధికార పార్టీ తహతహలాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు సన్నద్ధమవుతుంటే.. మరోపక్క పార్టీ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పరిస్థితులు అదుపు తప్పిపోతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో తెలుగు తమ్ముళ్ల మధ్య అగాథం నానాటికీ పెరిగిపోతోంది. ఎమ్మెల్యేకు, ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య దూరం ఇప్పుడు పార్టీ అధిష్ఠానాన్ని అయోమయలో పడేస్తోంది. ఎన్నికల సంగ్రామానికి శక్తులన్నీ కూడగట్టుకునే పనిలో ఉండాల్సిన సమయంలో.. పార్టీలో విభేదాలతో నియోజకవర్గం వెనుకబడిపోతోంది. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో.. అన్ని నియోజక వర్గాల కంటే తిరుపతి దిగువన ఉండటం పార్టీలో లుకలుకలకు నిదర్శనంగా నిలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. వెంటనే చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమనే చర్చ మొదలైంది.
తిరుపతిలో 2014లో జరిగిన ఎన్నికల్లో వెంకటరమణ గెలుపొందారు. ఆయన 2015 డిసెంబర్ లో మృతి చెందారు. దీంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో రమణ సతీమణి సుగుణమ్మ భారీ మెజారిటీలో విజయం సాధించారు. ఇంత వరకు బాగానే ఉన్నా తిరుపతి టీడీపీలో చాప కింద నీరులా అసంతృప్తులు..ఆధిపత్య పోరు విస్తరించినట్లు తెలుస్తోంది.
తిరుపతి మహానగరంలో టీడీపీకి మంచి కేడర్ ఉంది. అయితే ఆ క్యాడర్ను సమన్వయం చేసుకోవడంలో ఆమె ఘోరంగా విఫలమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇందుకు ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు అల్లుడు సంజయ్ వ్యవహరిస్తున్న తీరు ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీని ఎంతో కాలంగా నమ్ముకొని ఉంటున్న వారికి ప్రాధ్యానత్య ఇవ్వడం లేదని సీనియర్లు మొహం చాటేస్తున్నారు. వీరిని సమన్వయం పరచడంలో ఎమ్మెల్యే సుగుణమ్మ విఫలం చెందారని చెబుతున్నారు.. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీని ప్రభావం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుపైనా పడిందని చెబుతున్నారు. సభ్యత్వ నమోదులో తిరుపతి నియోజకవర్గం చివరిలో ఉండటంతో.. నమోదును సీరియస్గా తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యేతోపాటు ఇతర నేతలకు చంద్రబాబు గట్టిగా చెప్పారు. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గతంతో ఇక్కడ 50వేలకు పైగా సభ్యత్వాలు నమోదు చేస్తే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా దిగజారి పోయింది. ఇప్పటికి కేవలం 15 వేలు మాత్రమే సభ్యత్వం దాటిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదుకు గడువు ముగుస్తున్నా తిరుపతి నేతల్లో మాత్రం నిస్తేజం నెలకొంది. మూడు పర్యాయాలు నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దంపూరు బాస్కర్ యాదవ్ కూడా నిస్తేజంగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనిరయర్లు నీలం బాలాజీ.. డాక్టర్ సుధారాణి తుడా ఛైర్మన్ నరసింహయాదవ్, కోవూరు బాల సుబ్రమణ్యం..బుల్లేట్ రమణ తదితర నేతలు దూరంగా ఉంటున్నారు.. సభ్యత్వ నమోదులో కూడా వూకా విజయకుమార్ వంటి సీనియర్లకు ప్రాధ్యాన్యత ఇచ్చి కలుపుకోని పోవడం లేదని చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న డాక్టర్ శ్రీనివాసులుపై పార్టీ నేత అన్నా రామచంద్రయ్య వర్గీయులు దాడి చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా దాడి చేసిన వారి దగ్గరికి వెళ్లి రాజీ చేసుకోమని చెబుతున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని వాపోతున్నారు. ఇప్పటికైనా అధినేత తిరుపతి నియోజకవర్గంపైన… పార్టీ పరిస్థితులపై దృష్టి సారించాలని సీనియర్లు కోరుతున్నారు.