సుదీర్ఘ పాదయాత్ర తర్వాత వైఎస్ జగన్ లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. చంద్రబాబు అసమర్థపాలన కారణంగా తాను ఈసారి అధికారంలోకి రావడం ఖాయం అన్న నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. దీనికితోడు తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలు తమకు అన్నివర్గాల నుంచి ఓట్ల సునామీ తెప్పిస్తాయని ఆయన నమ్ముతున్నాడు.
అందుకే జగన్ మాటల్లో తాను ఈసారి సీఎం కావడం ఖాయమనే మాట తరచూ వినిపిస్తోంది. వచ్చేది వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని జగన్ తరచూ అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మరో మూడు నెలలే అధికారంలో ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. వివిధ సమస్యలపై తనను కలిసేందుకు వచ్చిన వారితోనూ జగన్ ఇదే చెబుతున్నారు.
తాజాగా ఆయన కడప జిల్లాలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి లక్షా ఏభైవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. కడప జిల్లా అనంతరాజు పేట ఉద్యానవన విశ్వవిద్యాలయ విద్యార్దులు సమర్పించిన వినతిపత్రంపై జగన్ స్పందిచారు. అధికారంలోకి రాగానే చేసే పనులపైనా తరచూ ప్రకటనలు చేస్తున్నారు.
ఆత్మవిశ్వాసం మంచిదే కాదనలేం. కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2014లోనూ ఇదే సీన్ కనిపించింది. అప్పుడు కూడా జగన్ తాను అధికారంలోకి రావడం ఖాయం అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అందుకే చంద్రబాబును తక్కువ అంచనా వేయకుండా.. అన్ని కోణాల్లోనూ అప్రమత్తంగా ఉంటేనే జగన్కు అధికారం దక్కేది. లేకపోతే..చంద్రబాబు చాణక్యంతో మళ్లీ కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటుంది.