అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో వైసీపీ దాన్ని వ్యతిరేకించింది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని రాజధాని చేయాలని వైసీపీ భావించింది. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే అదే జరిగేదేమో కానీ.. చంద్రబాబు సీఎం అయ్యారు.
అందుకే.. ఇప్పుడు మళ్లీ జగన్ సీఎం అయితే.. రాజధానిని మార్చేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ఛానల్లో జగన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్నకు వైసీపీ అధినేత సమాధానం దాట వేశారు. సూటిగా సమాధానం చెప్పకుండా అమరావతిలో అన్నీ తాత్కాలిక కట్టడాలే కట్టేశారని జగన్ చెప్పారు.
మరి జగన్ మాటల వెనుక అర్థం ఏంటి.. అన్నీ తాత్కాలిక కట్టడాలే అంటే.. రాజధాని మార్చినా ఫరవాలేదనే భావన ఏమైనా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ రాజధాని మార్చే ఆలోచన లేకపోతే.. ఆ విషయం నేరుగా జగన్ చెప్పిఉండేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ జగన్ సీఎం అయితే రాజధాని మార్చాలని నిర్ణయించినా దానికి ప్రజల నుంచి మద్దతు లభించడం కష్టం. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి పదే పదే రాజధాని మార్చడం మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కొన్ని విషయాల్లో ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు కొనసాగించకతప్పదు.