టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. కీలకమైన 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే కుటుంబం బాబుకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందనే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నేతలు జంప్ అవబోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజకీయంగా అత్యంత కీలకమైన కర్నూలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు.. పార్టీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహార శైలి నానాటికీ వివాదాస్పదమంగా మారుతోంది. ఇది ముదిరి పాకాన పడింది. ఇక రేపో మాపో ఆమె టీడీపీని వీడటం ఖాయమనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గెలిచి.. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. ముందుగా అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉంటే.. ఎమ్మెల్యేలు మాత్రం అందుకు భిన్నంగా యోచిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో లుకలుకలతో ఎవరు ముందు పార్టీని వీడతారనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే టీడీపీ నుంచి పడే మొదటి వికెట్.. భూమా కుటుంబం నుంచేననే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపించడం విమర్శలకు దారితీసింది. అఖిలతో పాటు బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వీడుతారనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు మరో ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో భూమా దంపతులు వైసీపీ నుంచి గెలుపొందారు. తర్వాత శోభానాగిరెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసిన అఖిలప్రియ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత భూమా నాగిరెడ్డి, అఖిల టీడీపీలో చేరారు. అనంతరం నాగిరెడ్డి మరణించడంతో అఖిల సోదరుడు బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత అఖిలకు మంత్రి పదవి దక్కింది. అయితే తర్వాత అఖిల వివాహంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడంతో.. రాజకీయ ప్రాధమ్యాలు మారాయని జిల్లా నేతలు చెబుతున్నారు. గతంలో ఆమె తల్లి, తండ్రి.. చిరంజీవి స్తాపించిన ప్రజారాజ్యంలో చేరారు. ఇప్పుడు ఆయన తమ్ముడు పెట్టిన జనసేనలో చేరాలని.. అఖిల, బ్రహ్మానందరెడ్డి భావిస్తున్నారని సమాచారం. అయితే వీరితో పాటు ఎస్వీ మోహన్రెడ్డి కూడా పవన్ చెంతకే చేరాలని నిర్ణయించుకున్నారట.