ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు తెరలు లేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో అసంతృప్తులతో సతమతమవుతున్న చంద్రబాబుకు ఇప్పుడు ఫ్యామిలీ నుంచి మరో ఇబ్బంది ఎదురుకాబోతోంది. స్వయానా చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం టీడీపీ నుంచి దూరమై చాలా కాలం అయ్యింది. దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించారు. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఐతే.. నిన్నమొన్నటి వరకూ రాజకీయాల్లో యాక్టివ్ గా లేని దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. ఇప్పుడు కొడుకుతో సహా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ మేరకు ఇద్దరికీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమై తర్జనభర్జన జరుగుతోందట. దగ్గుబాటి భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని చెబుతున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి నైతికంగా కాస్త బలం చేకూరినట్టు అవుతుంది. దగ్గుబాటి స్వయంగా చంద్రబాబు తోడల్లుడు కావడంతో ఈ చేరికకు ప్రాధాన్యం చేకూరుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి చేరికలు సాధారణమే అయినా.. ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో ఆసక్తిరేగుతోంది.