చంద్రబాబును అపర చాణక్యుడిగా ఆయన అనుచరులు కీర్తిస్తుంటారు. మోడీ సర్కారుతో గొడవ పెట్టుకున్న చంద్రబాబు.. ఆయన్ను ప్రధాని కుర్చీ నుంచి లాగి అవతల పారేయడమే లక్ష్యంగా ఆజన్మ శత్రువైన కాంగ్రెస్ తోనూ చేయికలిపారు. దేశంలోని మెజారిటీ పార్టీలను కాంగ్రెస్ కూటమి కింద తెస్తానంటూ రాహుల్కు భరోసా ఇచ్చారు.
అందుకు అనుగుణంగానే జాతీయ పార్టీలతో మంతనాలు జరపడం మొదలుపెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మా బాబు బయలుదేరాడు.. మోడికి ఇక చుక్కలే అన్న రీతిలో ప్రచారం చేశాయి. బాబు రాజకీయం చూసి మోడి వణికిపోతున్నాడని బిల్డప్ ఇచ్చాయి.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు సిద్ధమైన తీరు చూస్తే చంద్రబాబు చాణక్యం ఉత్తరప్రదేశ్లో ఫలించలేదనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రస్తావన లేకుండానే మాయావతి, అఖిలేష్ యాదవ్ ఏకమైన తీరు కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయపడేసింది. చాణక్యుడికి పాఠాలు చెప్పే చంద్రబాబుకూ ఈ పరిణామం మింగుపడటం లేదు. యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్కు స్నేహితులు దొరక్కపోతే.. ఆ కూటమి ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న.
మరోవైపు ఈ పరిణామం తెలంగాణ సీఎ కేసీఆర్కు సంతోషం కలిగిస్తోంది. ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ దూరం పెట్టడం వల్ల వారు ఫెడరల్ ఫ్రంట్ వైపు వచ్చే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. రాష్ట్రాల ఫ్రంట్ అనే కోణంలో వారిని కేసీఆర్ తనవైపు తిప్పుకునే అవకాశాలు లేకపోలేదు. ఫెడరల్ ఫ్రంట్లో ఎస్పీ, బీఎస్పీ చేరినా చేరకపోయినా.. కాంగ్రెస్ నుంచి దూరం కావడం మాత్రం గులాబీ దళపతికి సంతోషం కలిగించే అంశమే.