పవన్ కల్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయన సొంతంగా అధికారంలోకి వచ్చే సీన్ లేకపోయినా.. ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరి 2019 ఎన్నికల్లో పవన్ ఏవైపు ఉంటారు.. ఎవరికి మద్దతు ఇస్తారు.. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్.
తమ బలాన్ని చూసే తమతో పొత్తుకు అటు టీడీపీ, వైసీపీ తహతహలాడుతున్నాయని పవన్ కల్యాణ్ ఇటీవల ఓ సభలో మాట్లాడారు. టీడీపీ నుంచి పవన్ కు ఆహ్వానం విషయంలో ఎలాంటి అనుమానం లేదు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబే పవన్కు విజ్ఞప్తి చేశారు. మరి వైసీపీ నుంచి ఎవరు పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం రాయబారం నడిపారు.. ఈ విషయంపై క్లారిటీ కావాల్సి ఉంది.
వైసీపీ తరపున కొందరు టీఆర్ఎస్ నేతలు రాయబారం పంపారని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఈ వాదనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ వైసీపీపై విమర్శలకు దిగుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. టీఆర్ఎస్ తరుఫున ఎవరు పవన్ను కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కుట్రలో భాగంగానే పవన్ మాట్లాడుతున్నాడన్నారు. వైసీపీకి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని పార్థసారధి అంటున్నారు. మరి ఈ డిమాండ్కు పవన్ కల్యాణ్ స్పందించి.. ఆ వివరాలు బయటపెడితే బావుంటుందేమో. లేకపోతే పవన్ శీలంపై అనుమానాలు వస్తాయి. ఇప్పటికే పవన్ టీడీపీ డైరెక్షన్లోనే పని చేస్తున్నారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.