ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు.. కానీ కొంతమందే ఆ డబ్బుకు సార్థకత చేకూరుస్తారు. ఆ డబ్బుతో సమాజానికి గరిష్ట ప్రయోజనం అందేలా చూస్తారు. అలాంటి వారిలో ఒకరే పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్థన్రావు. ఇంతకీ ఈయన ఎవరు.. ఏం చేశారు.. ఎందుకు అంతగా ఈయన్ని పొగడాలి.. ఓ సారి చూద్దాం.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఈ జనార్థన్ రావు అప్పట్లోనే ఇంజినీరింగ్ చదివారు. కోల్ కతాలోని హిందూమోటార్స్ లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో సొంత పరిశ్రమ స్థాపించారు. వెల్జాన్ హైడ్రేయర్, వెల్జాన్ డెన్సన్ సంస్థలను స్థాపించి పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు.
తన పరిశ్రమల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన జనార్ధనరావు.. ఆ ధనాన్ని సమాజసేవకే వినియోగిస్తున్నారు. సొంత గ్రామంలోని పాఠశాలకు కొత్త భవనాలు కట్టించారు. ఫర్నిచర్, ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం 19 ఏళ్ల క్రితమే 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.
హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి కోసం రూ. 10 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ సొమ్ముతో జనార్థన్రావు తల్లి పేరిట ఓ భవనం నిర్మించారు. హుద్ హుద్ తుపాను సమయంలో కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన ఏలూరులో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఏకంగా40 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వేల కోట్లు సంపాదించి బ్యాంక్ అకౌంట్లో అంకెలు చూసి గర్వపడేవారికంటే.. ఆ సొమ్మును నలుగురి బాగు కోసం దానం చేస్తున్న జనార్ధన్రావులాంటి వారికి చేతులెత్తిమొక్కాల్సిందే. కాదంటారా..?