గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్టణం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చెందిన వైఎస్ విజయమ్మ రానున్న ఎన్నికలలో పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయమ్మ 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో జగన్ కోరితే కచ్చితంగా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి దిగుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. జగన్ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించిదని, వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా ధీమా వ్యక్తం చేశారు.
ఎపి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ అన్నారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు.
ఎన్నికల్లో వైసిపి ఏకైక ఎజెండా ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. ఏదిఏమైనా ఇంటర్వ్యూలో వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పడంలో ధీమా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ రాష్ట్రంలో విజయ కేతనం ఎగుర వేయటం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.