ఎంతవారలైనా కాంత దాసులే.. బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు.. ఈ సామెతలన్నీ ఊరికే పుట్టలేదు. అందమైన అమ్మాయి వలపు బాణం వేస్తే గిలగిలా కొట్టుకోని పురుషుడు ఉంటాడా.. అందుకే ఇప్పుడు మన పొరుగు దేశం పాకిస్థాన్ మన సైనికులపై ఇలాంటి అందమైన అమ్మాయిలను అస్త్రాలుగా ప్రయోగిస్తోంది.
హానీ ట్రాప్ గా చెప్పుకునే ఈ వలపు యుద్ధం కొత్తదేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా అనికా చోప్రా పేరుతో ఓ పాక్ భామ విసిరిన వలపు వలలో మన భారత సైనికులు 50 మంది వరకూ చిక్కుకున్నారట. మన సైన్యానికి చెందిన రహస్య సమాచారం అందించారట.
ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేయగా.. మరో 50 మందిని సైన్యాధికారులు ప్రశ్నిస్తున్నారట. పచ్చ కోక కట్టుకుని వయ్యారాలు పోతూ దిగిన ఫోటోను ఫేస్బుక్ ప్రోఫైల్ పిక్ గా పెట్టుకుని 50 మంది వరకూ సైనికులను వల్లో వేసుకుంది. తనను తాను మిలటరీ నర్సింగ్ గ్రూపునకు కెప్టెన్ గా చెప్పుకునేది.
మెల్లగా మనోళ్లను ఫేస్బుక్లో ఫ్రెండ్స్ గా చేసుకుని చాట్ చేసేది. ఆ చాటింగ్లోనే ఒడుపుగా మన సైన్య రహస్యాలు తెలుసుకునేది. ఆమెతో మాట్లాడుతున్న ఓ జవాను ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు అతనిపై నిఘా పెడితే డొంకంతా బయటపడింది. ఆ వగలాడి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కు చెందిన మహిళగా దర్యాప్తులో తేలింది. రాజస్థాన్ పోలీసులు ఆ జవానును అరెస్టు చేశారు.