ఇప్పటి వరకూ జాతీయ మీడియా సంస్ధలన్నీ
లోక్ సభ ఎన్నికల్లో జనాల మూడ్ ఎలాగుంటుందనే విషయంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి.
లోక్ సభ ఎన్నికలపై సర్వే చేస్తున్న సంస్ధలన్నీ అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎందుకు
దృష్టి పెట్టలేదు. మీడియా సంస్ధల లెక్క ప్రకారం పార్లమెంటు స్ధానాల్లో ఎక్కువ
గెలుసుకున్న పార్టీనే అసెంబ్లీలో కూడా అధికారంలోకి వస్తుందని అంచనా ఉండవచ్చేమో.
అందుకనే ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో జనాల మూడ్ గురించి సర్వేలు చేయలేదు. కానీ
అన్నీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఫలితం ఒకే తీరుగా ఉండదు.
మామూలుగా ఏ పార్టీ అభ్యర్ధి అయినా ఎంపిగా గెలవాలంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీనే ఆధారం. ఎక్కడైనా అసెంబ్లీ అభ్యర్ధులకు, ఎంపి అభ్యర్ధికి ఒకే విధంగా ఓట్లు పడటం చాలా అరుదు. మొత్తం మీద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ అసెంబ్లీల్లో వచ్చే మెజారిటీపైనే ఎంపి అభ్యర్ధి గెలుపు ఆధారపడుంటుందని అందరికీ తెలిసిందే. కానీ అన్నీ నియోజకవర్గాల్లోను ఫలితం ఇలాగే ఉంటుందని అనుకునేందుకు లేదు.
ఉదాహరణకు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని తీసుకుందాం. చిత్తూరు ఎంపి స్ధానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో చిత్తూరు, చంద్రగిరి, పీలేరు, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, కుప్పం అసెంబ్లీలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపును పక్కనపెడితే ఎంపి అభ్యర్ధిగా మాత్రం తెలుగుదేశంపార్టీ అభ్యర్ధే గెలుస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు మంచి మెజారిటీతో గెలిచినా చాలు మామూలుగా అయితే కాంగ్రెస్ అభ్యర్దే గెలవాలి.
కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్సులో నడుస్తోంది. ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచి, ఎంపి అభ్యర్ధికే మెజారిటి వచ్చినా గెలుపు మాత్రం టిడిపిదే అవుతోంది. ఎలాగంటే మొత్తం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పం అసెంబ్లీలో వచ్చే మెజారిటీనే ఎంపి అభ్యర్ధుల గెలుపులో కీలకమవుతోంది. ఐదు అసెంబ్లీల్లో ప్రత్యర్ధులకు మెజారిటీ వచ్చినా కుప్పం అసెంబ్లీకి వచ్చేసరికి టిడిపి మెజారిటీ మొత్తాన్ని మింగేస్తోంది. ఒక్క కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే టిడిపి ఎంపి అభ్యర్ధికి సుమారు 70 వేల మెజారిటీ వస్తోంది. దాంతో విజయం టిడిపినే వరిస్తోంది. అందుకనే గడచిన 6 సార్లుగా చిత్తూరు ఎంపి స్ధానంలో టిడిపినే గెలుస్తోంది.
కాబట్టి చిత్తూరు లోక్ సభ నియోజకవర్గాల్లాంటివి రాష్ట్రంలో ఇంకా ఉండే అవకాశం ఉంది. కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కూడా కుప్పం లాంటిదే. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎన్ని అసెంబ్లీల్లో ప్రత్యర్ధులకు ఎంత మెజారిటీ వచ్చినా ఉపయోగం ఉండటం లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సిపిదే విజయం. ఒక్క పులివెందుల అసెంబ్లీలో వచ్చే మెజారిటీనే కడప ఎంపి ఫలితాన్ని శాసిస్తోంది. కాబట్టి సర్వే చేసే సంస్ధలేవో ఎంపి స్ధానాల విషయంలో మాత్రమే కాకుండా అసెంబ్లీలపైన కూడా దృష్టి పెడితే బాగుటుంది.