ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఓ పేరుంది. ఆయన గురించి తెలిసిన నాయకులు, విశ్లేషకులు ఆయనకు ఓ పేరు పెట్టారు. ఆయన రాజకీయ చాణిక్యుడు! అని పిలుస్తారు. ఇలా ఏదో ఆయనంటే ముద్దొచ్చి పెట్టారని అనుకుంటే పొరపాటే.. రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకోగల దిట్ట.. ఎవరైనా తనను విమర్శించినా కూడా..దానిని కూడా రాజకీయంగా వాడుకుని పైకి ఎదిగే నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. అంతేకాదు ఆయన సైన్యాన్ని కూడా అంతే సామర్ధ్యంగా పెంచుకుంటారు. సరే.. తాజా విషయానికి వస్తే.. రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఆయన అనుకున్నంత ఈజీగా ఇప్పుడు రాజకీయాలు లేవు.
ముఖ్యంగా విపక్ష నాయకుడు జగన్ ఏడాదికి పైగా కాలం నుంచి పెద్ద నిర్వహించిన పాదయాత్ర పెను సంచలనం. అంతేకాదు, ఆయన అధికారంలోకి వచ్చాక చేపడతానని చెప్పిన నవరత్నాలు, వివిధ సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు, సంక్షేమ పథకాలకు ఇస్తున్న బడ్జెట్ పెంపు, అదేవిధంగా సామాజిక పింఛన్లను పెంచడం వంటి అనేక హామీలు ఇచ్చారు. వీటికి దాదాపు అన్ని వర్గాల ప్రజలు ముగ్దులయ్యే పరిస్థితి కనిపించింది. దీంతో జగన్ ఇక, తనకు ఎదురు లేదని బావించారు. అంతేకాదు, ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తుండడాన్ని కూడా ఆయన తనకు అనుకూలంగా మలుచుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని భావించారు.
ఈ క్రమంలోనే కేసీఆర్కు జగన్కు, మోడీకి,జగన్కు మధ్య రాజకీయంగా సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు ప్రచారం చేయడం ప్రారంభించారు. రాష్ట్రం విడిపోవడానికి , ప్రత్యేక హో దాకు అడ్డుపడిన కేసీఆర్తో జగన్ చెలిమి చేస్తున్నారని, అదేవిధంగా హోదా ఇవ్వకుండా తెలుగు వారిని అవమానించిన మోడీతోనూ జగన్ పొత్తుకు రెడీ అయ్యారని ప్రచారం చేశారు. అయితే, వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పాదయాత్ర కూడా ముగిసింది. దాదాపు 3500 కిలో మీటర్ల దూరాన్ని జగన్ పూర్తి చేయడం, కుటుంబానికి దూరం కావడం వివిధ సామాజిక వర్గాలకు చేరువకావడం వంటి కీలక పరిణామాలు..
సెంటిమెంటుగా మారి చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన చాణక్యానికి పదును పెంచారు. ఉన్నట్టుండి రాష్ట్రంలో దాదాపు కోటి మంది ఓటర్లను ప్రభావితం చేసేలా సామాజిక పింఛన్లను పెంచారు. ఇవి పెరుగుతున్నవి వచ్చే నెల నుంచే అయినా.. ఇప్పుడు ప్రకటించడం వెనుక బాబు వ్యూహం కేవలం జగన్ పాదయాత్రకు వచ్చిన మైలేజీని పటాపంచలు చేయడమే! ఈ విషయంలో ఇప్పటి వరకు చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ ఇద్దరు కలుసుకున్నా.. బాబు ఉదారత గురించే మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో తమకు కూడా ఏదో ఒకటి చేస్తారని వారు చర్చించుకోవడం గమనార్హం. ఫలితంగా జగన్ ఊసు పెద్దగా వినిపించక పోవడం గమనార్హం.