టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబులోమార్పు వచ్చింది. అనూహ్యంగా రాత్రికి రాత్రి ఆయన మారిపోయారు. ఊహించని విధంగా రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అనేక వర్గాలను తన వైపు తిప్పుకొనేందుకు కుల మతాలకు అతీతంగా ఆయన సాహసం చేశారు. దాదాపు లక్షకోట్లకు పైగా భారం పడుతున్నా లెక్కచేయకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఆయన సామాజిక పింఛన్లను ప్రకటించారు. పెంచేశారు. మరి ఈప్రకటన వెనుక ఏం జరిగి ఉంటుంది. ఒక్క విపక్షాలను మాత్రమే ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఇలా చేశారా? లేక దీని వెనుక మరో రీజన్ ఉందా ? అంటే ఖచ్చితంగా ఇంకో రీజన్తోనే చంద్రబాబు ఇలా వరాలజల్లు కురిపించారని అంటున్నారు.
దీనిపై ప్రస్తుతం జరుగుతున్న విశ్లేషణలు చూస్తే.. బాబు మానసపుత్రిక వంటి జన్మభూమి కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఇది ముగిసిన మరుక్షణమే ఆయన మారిపోయారు. ఈ నెల 2 నుంచి 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం దీనికి ముందుకు ఈ నాలుగేళ్ల నుంచి తాము చేస్తున్న కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వం సహకరించని విధానాలను, విపక్షాలు ప్రతి పనికీ అడ్డుపడుతున్న తీరును శ్వేత పత్రాల రూపంలో కూడా ప్రజల ముందు ఉంచారు. అయితే, ఈ రెండు కార్యక్రమాలు అంటే అటు జన్మభూమి, ఇటు శ్వేత పత్రాలు కూడా ఆశించిన మైలేజీ ఇవ్వలేదు. ఆది నుంచి చెబుతూ వచ్చిన ప్రజల సంతృప్తి కూడా 85 శాతం నుంచి జన్మభూమి కార్యక్రమాలను అంచనా వేశాక ఇది 60శాతమేనని స్పష్టమైంది.
శ్వేత పత్రాలపై జోరుగా చర్చ జరుగుతుందని భావించినా.. అది కూడా సక్సెస్ కాలేదు. దీనికితోడు జన్మభూమి కార్యక్రమాల్లో విపక్షం కన్నాకూడా సొంత పార్టీలోని నేతలు సృష్టించిన రగడలే ఎక్కువగా దర్శన మిచ్చాయి. దీంతో చంద్రబాబు ఇక, వీటితో లాభంలేదని నిర్ణయించుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా.. ప్రజలు తనకు దూరమవు తారని భావించారు. దీంతో వెంటనే ఆయన సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. నియోజకవర్గాల్లో సట్టింగు ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో పార్టీ వ్యతిరేకత ఉన్నప్పటికీ తన ఇమేజ్ను పెంచుకునేందుకు చంద్రబాబు ప్రాదాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే సామాజిక వర్గాలకు ఫించన్లు ఇచ్చే క్రతువును రెట్టింపు చేయడం వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనివల్ల అటు విపక్షాలను, ఇటు పార్టీపై పెరుగుతున్న అసంతృప్తిని కూడా తుడిచి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఈ ప్రయోగం ఏమేరకు ఓట్లు రాబడుతుందో చూడాలి.