వై.ఎస్.జగన్ చెల్లెలు షర్మిల మరోసారి వార్తల్లోకి వచ్చారు. సినీ నటుడు ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అయినా పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పనిలో పనిగా ఇదంతా టీడీపీ నాయకుల పనే అంటూ ఆరోపణలు చేశారు.
నిజమే. ఇది చాలా దారుణమైన విషయమే. చేయని నేరానికి పదే పదే బురద జల్లుతూ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ట్రోల్ చేయడం సహించరాని నేరమే. ఈ విషయాన్ని ఖండించాల్సిందే. కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. షర్మిల గతంలోనే ఓసారి ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. పోలీసులకూ కంప్లయింట్ ఇచ్చారు.
అయినా ట్రోలింగ్ ఆగడం లేదన్నది షర్మిల ఫిర్యాదు. ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుందని ఆమె అంటున్నారు. నిజమే. కానీ.. ఇలాంటి ట్రోలింగ్స్ అన్నీ బజారున మొరిగే పిచ్చికుక్కలతో సమానం. అలా పిచ్చికుక్కలు మొరిగినప్పుడల్లా మనం వాటికి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు వాటిని పట్టించుకోకపోడమే మేలు.
షర్మిల ఒక్కసారి వివరణ ఇచ్చారు కాబట్టి.. ఇక ఇలాంటి ఊర కుక్కల మొరుగుళ్లు పట్టించుకోవడం మానేయాలి. చేతిలో కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కడూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా రాసేయొచ్చు. ఎంతమందినని కంట్రోల్ చేయగలం. ఈ విషయాన్ని మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ మరికొంత చర్చ జరగడం - ట్రోలింగ్ కావడం తప్ప సాధించేదేమీ కనిపించడం లేదు. మనిషికో మాట.. పశువుకో దెబ్బ అన్నారు కదా.