శత్రువుకు శత్రువు... మిత్రుడంటారు! ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఆయనకు ప్రధాన శత్రువు, పోటీ దారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరి ఈయనకుఎవరెవరు శత్రువులు ఉంటారో.. వారందిరినీ మిత్రులను చేసుకునేందుకు జగన్ చాలా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి వారిని చేరదీసి.. పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే కీలకంగా జగన్ అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో అధికార పీఠం చేజారిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలపై ఉన్నారు.
ఈ నేపథ్యంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీసద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ పుంజు కోవడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న వైసీపీ అధినేత జగన్.. ఇక్కడ ఎవరెవరు చంద్రబాబుకు శత్రువులో చూసుకుని వారిని తన పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిలో తొలివరుసలో నిలిచిన ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబుకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన పార్టీలో చేర్చుకుని వారి ద్వారాబాబును దెబ్బకొట్టొచ్చని ప్లాన్ చేసుకున్నారు. ఇక, ఇప్పటికే ఏ పార్టీలోనూ చేరకుండా ఖాళీగా ఉన్న దగ్గుబాటి కూడా జగన్ పిలుపుతో పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు.
అదేసమయంలో తన కుమారుడు హితేష్ చెంచురామ్ భవితవ్యం కోసం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మధ్యవర్తిగా వైసీపీ నాయకుడు, ప్రకాశం జిల్లా వ్యవహారాలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించారు. రెండు సార్లు దగ్గుబాటితో స్వయంగా మాట్లాడి మీరు వస్తే.. పార్టీలో కీలక పదవి ఇస్తామని ప్రకటించారు.
అదేవిధంగా కుమారుడికి పరుచూరు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తామన్నారు. దీంతో ఎలాగూ చంద్రబాబుకు యాంటీ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక్కడ చిత్రం ఏంటంటే గత రెండు రోజులుగా దగ్గుబాటి వైసీపీలోకి చేరతారనే వార్తలు వస్తున్నా.. ఆయన ఎక్కడా ఖండించలేదు. దీంతో ఈ నెల చివరిలో మంచి రోజు చూసుకుని పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.