ఏపీలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీయార్ అంటే ఎమో అనుకున్నారంతా. బాబు సైతం ఆ గిఫ్ట్ ఏంటో చూస్తానని అన్నారు. ఇపుడు చూడబోతే భారీ గిఫ్టే కేసీయార్ ప్యాక్ చేసే పనిలో పడ్డారని అంటున్నారు. ఆ గిఫ్ట్ ప్యాక్ లో కేసీయార్ గుర్తు మార్క్ గులాబీలతో పాటు ముళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు
జగన్ తో భేటీ:
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ని గెలిపించుకోవాలన్నది కేసీయర్ ప్రధాన అజెండా. ఆ మీదట రెండు రాష్ట్రాల్లోని ఎంపీలతో కలసి కేంద్రంలో చక్రం తిప్పాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. కేవలం తెలంగాణా ఎంపీ సీట్లు అంటే 17 మాత్రమే ఉంటాయి. ఏపీలో జగన్ ఎక్కువ సీట్లు గెలిస్తే మద్దతు బాగా పెరుగుతుంది. అపుడా సంఖ్య మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ తో సమానంగా ఉంటుంది. అపుడు కేంద్రంలో ఏ పార్టీని అధికారంలోకి తేవాలన్నా ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా మారుతుంది. ఆ వ్యూహంతోనే కేసీయార్ ఇపుడు జగన్ మద్దతు కోసం తన కుమారుడు కేటీయార్ ని పంపించారు.
ఇక తేలిక కారు :
నిజానికి ఏపీని విడగొట్టడం వెనక కూడా హిందీ వాళ్ళ కుట్ర ఉందని అంటారు. మొత్తంగా 42 ఎంపీ సీట్లు ఉన్న ఉమ్మడి ఏపీని రెండు ముక్కలు చేయడం, రెండు రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉండడంత్గో మాట చెల్లుబాటు కానీయకుండా చేయడం ఈ కుట్ర వెనక ఉన్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రాంతాలుగా కలసి ఉండాల్సిన బాబు, కేసీయార్ ల మధ్యన సఖ్యత కొరవడింది. దాంతో ఈ ఇద్దరూ విడిగా డిల్లీకి వెళ్ళి తమకు ఉన్న సీట్లతో చేసేది ఏమీ లేదు. అదే జగన్, కేసీయర్ కలిస్తే తెలుగు రాష్ట్రాల ఎంపీల సీట్లు బాగా పెరుగుతాయి. అంతే కాదు డిల్లీ పెద్దలకు కూడా కళ్ళు చెదురుతాయి. సరిగ్గా ఈ అంచనాలే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీయార్, జగన్ లను కలుపుతున్నాయనుకోవాలి.
తెలుగు రాష్ట్రాలకు లాభమే :
రెండు రాష్ట్రాల్లోని కీలక రాజకీయ పార్టీలు పొరపొచ్చాలు లేకుండా పాలించుకోవడమే కాదు, డిల్లీని నిలబెట్టి పనులు చేయించుకుంటే విడిపోయిన రాష్ట్రాలు అభివ్రుద్ధి చెందుతాయి. ఓ విధంగా ఫెడరల్ ఫ్రంట్ కట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకే మేలు జరుగుతుంది. ఇపుడు తెలుగు వాణి ఇంకా గట్టిగా డిల్లీలో వినిపిస్తుంది. విడిగా డిల్లీ వెళ్ళి ఇన్నాళ్ళు బాబు, కేసీయార్ కూడా చులనక అయిపోయారు. ఏకంగా ప్రధాని పార్లమెంట్ లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు పోలిక పెడుతూ హేళన చేశారు కూడా. రేపటి రోజున ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కలివిడిగా ఉండడం బెటర్. కానీ కేసీయార్, చంద్రబాబుల మధ్యన ఇగోల కారణంగా అది కుదిరే వ్యవహారం కాదు. జగన్ ఈ విషయంలో కేసీయార్ కి అందుకే బెస్ట్ ఆప్షన్ అయ్యారు.
పవన్ కూడా :
ఇక ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఇన్నాళ్ళు బయట రాష్ట్రాల పార్టీలను కలసిన కేసీయార్ ఇపుడు తెలివిగా సొంత ఇల్లు చక్కదిద్దుకోవడం మొదలుపెట్టారు. ముందు నిన్నటి వరకూ కలసి ఉండి, నేడు విడిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని తనకు అనుకూలంగా తిప్పుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియలో మొదట జగన్ని కలసిన కేసీయార్, తొందరలోనే పవన్ని కూడా కలుస్తారని అంటున్నారు. పవన్ సైతం జాతీయ పార్టీల తీరు పట్ల విముఖంగా ఉన్నారు.
ఆయన గతంలో కాంగ్రెస్ ని ద్వేషిస్తూ పార్టీ పెట్టారు. ఇపుడు బీజేపీ మోసం చేసిందని కూడా అంటున్నారు. ఆ విధంగా పవన్ విధానం ఫెడరల్ ఫ్రంట్ కి అనుకూలమే అవుతుంది. ఏపీలో రెండు కీలక పార్టీలను కేసీయర్ ఫెడరల్ ఫ్రంట్ లోకి తేగలిగితే ఏపీ రాజకీయంతో పాటు, జాతీయ రాజకీయాల్లో కూడా కీలకమైన మార్పులు తప్పవు. అపుడు కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఫెడరల్ ఫ్రంట్ చక్రం తిప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఏపీలోనూ జగన్, పవన్ ఒక గొడుగు కిందకు వస్తే చంద్రబాబు ఓటమి దాదాపుగా ఖరారు అయినట్లే. అందుకే కేసీయార్ రిటర్న్ గిఫ్ట్ చాలా బరువైనది కూడా సుమా.