కేటీఆర్ - జగన్ భేటీని తన రాజకీయ అస్త్రంగా మలచుకునేందుకు తెలుగుదేశం నేతలు సిద్ధమయ్యారు. అటు జగన్తో కేటీఆర్ భేటీ పూర్తయ్యిందో లేదో.. నిమిషాల్లో టీడీపీ నేతల ప్రెస్ మీట్లు ప్రారంభమైపోయాయి. ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో టీఆర్ఎస్- వైసీపీ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయంటూ టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
కేసీఆర్ పాదాల దగ్గర ఆంధ్రుల ఆత్మాభిమానం తాకట్టు పెట్టడానికే చర్చల పేరుతో కేసీఆర్-జగన్ రాజకీయ బాగోతం ప్రారంభించారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. అది ఫెడరల్ ఫ్రంట్ కాదని.. మోడీ ఫ్రంట్ అంటూ కేసీఆర్ ప్రంట్ను ఎద్దేవా చేశారు ఉమ. గతంలో పలు వేదికలపై కేసీఆర్ ఆంధ్రప్రజలను తిట్టిన తిట్లు అంటూ పాత విషయాలను మంత్రి ఉమ గుర్తు చేశారు.
ఆంధ్రప్రజలను లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులే అంటూ తిట్టిన కేసీఆర్తో జగన్ ఎలా చర్చలు జరుపుతారని మంత్రి ఉమా ప్రశ్నించారు. హైదరాబాద్లో ఏపీ వాళ్లు కిరాయిదారులే అని కేసీఆర్ అన్న మాటలను జగన్ ఎలా మరిచిపోయారని మంత్రి ఉమ ప్రశ్నించారు. ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు కూడా రావని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు రోజూ ఆ బ్రాహ్మణుల కాళ్లకే మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
మరో టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా కేటీఆర్- జగన్ భేటీపై ఘాటుగా స్పందించారు. మోడీ డైరక్షన్లోనే కేసీఆర్, జగన్ పని చేస్తున్నారని తాము ఏడాదిగా చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఈ భేటీ రూపంలో సాక్ష్యం లభించిందన్నారు. పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ ఎంతకైనా తెగిస్తారని చెప్పేందుకు కేటీఆర్తో భేటీయే ఉదాహరణ అంటూ దుయ్యబట్టారు.