తెలుగు రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫెడరల్ ఫ్రంట్లో చేరమంటూ వైసీపీని టీఆర్ఎస్ ఆహ్వానించడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మరి ఈ భేటీ వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..ఎందుకు ఓసారి చూద్దాం. కేసీఆర్ ఫ్రంట్తో జగన్ చేతులు కలపడం వల్ల టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుంది.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో మరో పార్టీ చేరడం టీఆర్ఎస్ పార్టీ వాదనకు బలం చేకూరుస్తుంది. మరోవైపు తెలంగాణలో ఉన్న వైసీపీ కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మద్దతు ఇస్తారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు మద్దతు ఇచ్చారు. అది కొనసాగుతుంది.
అలాగే తెలంగాణలో ఉన్న సెటిలర్లలో చంద్రబాబు వ్యతిరేకులు కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు. సో.. ఈ భేటీ వల్ల కేసీఆర్ రాజకీయంగా లాభపడతారు. మరి జగన్ పరిస్థితి ఏంటి.. కేసీఆర్తో చేతులు కలపడం వల్ల ఆంధ్రాలో జగన్కు అదనంగా ఒక్క ఓటు కూడా రాదు. కొత్త ఓటు రాకపోగా.. ఏపీ వ్యతిరేకి అయిన కేసీఆర్తో చేతులు కలుపుతున్నాడని టీడీపీ ప్రచారం ఉధృతం చేస్తుంది.
పదే పదే ఈ అంశాన్ని ప్రచారం చేస్తుంది. ఇప్పటికే మోడీ, కేసీఆర్, జగన్ చేతులు కలిపారని ఆ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఈ భేటీ సరికొత్త సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే ఫెడరల్ ఫ్రంట్లో చేరడం వల్ల కూడా జగన్కు ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు. కానీ కేసీఆర్ కూటమిలో చేరడం కారణంగా ఏపీలో చాలా ఓటు బ్యాంక్ కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది. ఒక రకంగా ఇది జగన్ చేసుకుంటున్న మరో సెల్ఫ్ గోల్ లా కనిపిస్తోంది.