కేటీఆర్ తో జగన్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే కేటీఆర్ ను భేటీ కి పంపడం లో కేసీఆర్ అభిప్రాయం ఏంటని అందరూ విశ్లేస్తున్నారు. స్వయంగా కేసీఆర్ .. జగన్ తో ఎందుకు భేటీ కాలేదని చాలా లోతుగా అర్ధాలు వెతుకుతున్నారు. రాజకీయంగా తన కంటే జూనియర్ అయిన జగన్ తో.. తాను భేటీ కావటం తన స్థాయిని తగ్గించేలా చేస్తుందన్న ఉద్దేశంతోనే తన కుమారుడ్ని పంపినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
భేటీకి తాను వెళితే తన స్థాయి తగ్గుతుందని కేసీఆర్ భావిస్తే.. కేటీఆర్ కంటే సీనియర్ అయిన జగన్.. అందునా ఏపీకి విపక్ష నేతగా ఉన్న అధినేత.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో భేటీ కావటం ఆయన స్థాయి తగ్గదా? అంటూ క్వశ్చన్ వేసేటోళ్లు జగన్ పార్టీలోనే పలువురు ఉన్నారు.కేటీఆర్ తో జగన్ భేటీ రాజకీయంగా పెద్ద రాంగ్ స్టెప్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకూ ఒంటరిగా ఉన్న జగన్..కీలకమైన ఎన్నికల వేళ అదే తీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటున్నారు.
కీలకమైన ఎన్నికలకు ముందు ఇలాంటి భేటీలతో ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన ఫ్రంట్ లోకి చేరాలన్న ఆహ్వానాన్ని పలికే భేటీకి కేసీఆర్ రాకుదన్న నిర్ణయం చూస్తేనే.. ఆయన ఆలోచన ఏమిటో అర్థమవుతుందని.. అలాంటి మీటింగ్ కు జగన్ ఓకే అనటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు నిర్ణయాలతో జగన్ ను తరచూ చిన్నబుచ్చిన కేసీఆర్.. తాజాగా ఆయనతో భేటీకి తాను కాకుండా తన కుమారుడితో కూడిన బృందాన్ని పంపటం.. కచ్ఛితంగా చిన్నబుచ్చటమేనన్న భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.