అందరూ అనుకున్నట్లుగానే,
చంద్రబాబునాయుడు అండ్ కో భయపడుతున్నట్లుగానే తెలుగుదేశంపార్టీ చుట్టు
ఉచ్చుబిగుసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన
హత్యాయత్నం ఘటనలో టిడిపి కీలక నేత హర్షవర్ధన్ చౌదరికి ఎన్ఐఏ నోటీసులు జారీ
చేసింది. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి హైకోర్టు అప్పగించిన విషయం తెలిసిందే.
ఎప్పుడైతే ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ
సాధ్యంకాలేదు. ఈ నేపధ్యంలోనే టిడిపి నేత హర్షవర్ధన్ కు నోటీసులందటం టిడిపిలో కలకలం
రేపుతోంది.
హత్యాయత్నం ఘటనలో మొదటి నుండి కుట్రకు పాల్పడిన సూత్రదారులెవరో తేలాలంటూ వైసిపి డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో హత్యాయత్నం లేదు ఏమీ లేదని దాడి మొత్తం జగన్ నాటకమే అంటూ చంద్రబాబు అండ్ కో కొట్టిపారేస్తోంది. ఇక్కడే చంద్రబాబు, టిడిపి పాత్రపై అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి. హత్యాయత్నం నిజంగా డ్రామానే అయితే ఎన్ఐఏ విచారణలో తేలిపోతుంది కదా ? అప్పుడు తమకే ఇబ్బంది కదా అన్న వైసిపి ప్రశ్నకు టిడిపి నుండి సమాధానం లేదు. పైగా ఎన్ఐఏ విచారణను అడ్డుకుంటామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనతో టిడిపినే ఇరుకునపడింది.
సరే ఇదే ఘటనపై విచారణ జరిపిన సిట్ అధికారులు హర్షవర్ధన్ చౌదరిని విచారించనే లేదు. ఏదో తూతూమంత్రంగా పోలీసు స్టేషన్ కు పిలిపించి రాచమర్యాదలు చేసి పంపేశారు. హర్షాను విచారించాలంటూ వైసిపి నేతలు ఎంత మొత్తుకున్న సిట్ అధికారులు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు ఎన్ఐఏ తన విచారణలో భాగంగా హర్ష విచారణకు రంగం సిద్ధం చేయటంతో టిడిపిలో వణుకుమొదలైంది. తన విచారణలో గనుక హర్ష నుండి ఎన్ఐఏ వాస్తవాలు రాబట్టకలిగితే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలైనట్లే. సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్ఐఏ జరుపుతున్న విచారణలో తమ కొంప ఎక్కడ ముణుగుతుందో అన్న భయమే చంద్రబాబు అండ్ కోలో కనబడుతోంది. మరి ఎన్ఐఏ విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిందే.