సినీహీరో ప్రభాస్తో తనకు సంబంధం ఉందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైఎస్ జగన్ చెల్లెలు షర్మిళ ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారంపై చర్చ జరుగుతోంది. షర్మిలకు మద్దతుగా.. వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారు. షర్మిలపై జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబడుతూనే.. అది తమ పనే షర్మిల ఆరోపించడాన్ని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియా ప్రచారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను మొదటి నుంచి వైసీపీయే దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. జగన్పై సీబీఐ కేసుల సమయంలో అప్పటి జె డి లక్ష్మీనారాయణపై వైసిపి దుష్ప్రచారం చేసిందని గుర్తు చేశారు.
దర్యాప్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ జగన్ పై విచారణ సాగకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. చివరకు వైసీపీ న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారానికి తెగపడిందన్నారు చంద్రబాబు. ఇదే సమయంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ పై సానుభూతి వ్యక్తం చేశారు. పాపం.. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కూడా వైసీపీ అసభ్యంగా ప్రచారం చేసిందని చంద్రబాబు ఆరోపించారు.
టిడిపి మహిళా నేతలపైనా అసభ్యంగా ప్రచారం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. చివరకు తన కుటుంబంపై కూడా వైసీపీ దుష్ప్రచారం చేసిందన్నారాయన. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా సహించేది లేదన్న చంద్రబాబు.. పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.