ఏపీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఏపీ పర్యటనలో ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్.. వచ్చే ఎన్నకల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.
అంతే కాదు.. ఏపీలో బీసీలకు సరయిన నాయకత్వం లేదని.. తాను ఏపీ బీసీలకూ నాయకత్వం వహిస్తానని కామెంట్ చేశారు. తాను రాజకీయాలు చేయడానికే ఏపీ వచ్చానని కుండబద్దలు కొట్టారు. ఈ కామెంట్స్ తో చంద్రబాబు కోపం నషాళానికి అంటింది. ఒకప్పుడు తన పార్టీలో మంత్రిగా పని చేసిన తలసాని ఇప్పడు తనను తూలనాడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు.
అందుకే తలసానిపై కౌంటర్ ఫైర్ స్టార్ చేశారు. 26కులాలను బిసి జాబితా నుంచి తొలగించిన తెలంగాణ నాయకులు ఇప్పుడు బీసీలపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. కళింగ, తూర్పుకాపు, గవర, శెట్టిబలిజ తదితర కులాలను తొలగించి బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. 26బిసి కులాలకు అన్యాయం చేసినవారితో జగన్ అంటకాగుతున్నారని ఆరోపించారు.
అంతేకాదు.. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలని.. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని ఫణంగా పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.