పై ఫొటోలో కనిపిస్తున్న భవనం ఎవరిదో
తెలుసా ? వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది. అమరావతి ప్రాంతంలోని తాడికొండలో
పార్టీ, నివాసం కోసం జగన్ కొత్త భవనాన్ని నిర్మించుకుంటున్నారు. భవనం నిర్మాణం
కూడా దాదాపు అయిపోవచ్చింది. వచ్చే నెల 14వ తేదీన గృహప్రవేశం చేయనున్నట్లు సమాచారం.
పార్టీ రాష్ట్ర కార్యాలయం, నివాసం ఒకే కాంపౌండ్ లో ఉండేలా నిర్మాణం జరుగుతోంది.
టిడిపి, జనసేన, బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయాలు విజయవాడ ప్రాంతానికి వచ్చేసిన
వైసిపి కేంద్ర కార్యాలయం మాత్రం ఇంకా హైదరాబాద్ లో నే ఉంది.
ఇదే విషయమై టిడిపి నేతలు తరచూ జగన్ ను విమర్శిస్తుంటారు. చివరకు ఈమధ్యనే పవన్ కల్యాణ్ కూడా జనసేన కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యాలయం, నివాస నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈనెలాఖరులో కుటుంబంసమేతంగా జగన్ లండన్ వెళుతున్నారు. లండన్ లో చదువుతున్న తన కుమార్తెను చూడటం కోసం జగన్ కుటుంబంతో కలిసి వెళుతున్నారు. తిరిగి వచ్చేటప్పటికి భవనానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.
భవనం గృహప్రవేశానికి రావాల్సిందిగా జగన్ ఇఫ్పటికే కెసియార్ ను కోరారు. అందుకు కెసియార్ కూడా అంగీకరించారు. అందుకనే జగన్-కెటియార్ భేటీ తర్వాత జగన్ తో కెసియార్ స్వయంగా విజయవాడలో భేటీ అవుతారని చెప్పటంలో కెటియార్ ఉద్దేశ్యమిదే. అంటే గృహప్రవేశానికి హాజరవటంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ విషయంపై కూడా చర్చలు జరుగుతాయన్నమాట. మొత్తానికి జగన్ కొత్త ఇంటిలోకి మారటం, వెంటనే ఎన్నికలు ఎదుర్కోవటం వెంటవెంటనే జరుగుతాయన్నమాట. మరి ఇల్లు, లేదా పార్టీ కార్యాలయం వాస్తు ఎలాగుందో తేలిపోతుంది.