మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెండో స్పీకర్ కాబోతున్నారు. కేసీఆర్ మొదటి మంత్రివర్గంలో స్థానం పొందిన పోచారం.. రెండో విడతలో సభాపతి అవతారం ఎత్తబోతున్నారు. తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదనాచారి గత ఎన్నికల్లో ఓడిపోవడంతో స్పీకర్ ఎంపిక కోసం కేసీఆర్కు కసరత్తు తప్పలేదు.
దాదాపు ఆరుగురి పేర్లను స్పీకర్ పదవి కోసం ఎంపిక చేసిన కేసీఆర్.. చివరకు పోచారం శ్రీనివాసరెడ్డి వైపే మొగ్గారు. పద్మాదేవేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి వంటి వారి పేర్లను కేసీఆర్ చివరి నిమిషం వరకూ పరిశీలించారు. చివరకు అనుభవజ్ఞుడైన పోచారం శ్రీనివాసరెడ్డినే కేసీఆర్ ఖరారు చేశారు. అసెంబ్లీకి ఆరోసారి ఎన్నికైన పోచారంను స్పీకర్ పదవి కోసం కేసీఆర్ ఒప్పించారు.
సభాపతి పదవిపై సీనియర్లు అంత ఆసక్తి చూపించడం లేదు. స్పీకర్ పదవి ప్రోటోకాల్ ప్రకారం కీలకమైనదే అయినా దానికి ఎలాంటి అధికారాలు ఉండవు. అందుకే స్పీకర్ పదవి కంటే మంత్రి పదవే కావాలని కోరుకుంటారు. కాకపోతే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేనప్పుడు స్పీకర్ పదవికి అంగీకరిచక తప్పదు. స్పీకర్గా ఎన్నికైతే తదుపరి ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఐతే.. వచ్చే ఎన్నికల్లో పోచారం తనయుడి తప్పకుండా ఛాన్స్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారట.
మరోవైపు పోచారం స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కేసీఆర్ స్వయంగా ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనకు మజ్లిస్, బీజేపీ అప్పటికప్పుడే ఓకే చెప్పేశాయి. కాంగ్రెస్ కూడా స్పీకర్కు పోటీ పెట్టకూడదని నిర్ణయించడంతో పోచారం ఎన్నిక ఖాయమైంది.