ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నశించి పోతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఓ కవి అన్నట్లు మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు..అన్నట్లు తమ తోటి వ్యక్తుల కష్టాల్లో ఉన్నా ఏమాత్రం కనికరం చూపించనివారు ఎంతో మంది తారసపడుతూనే ఉన్నారు. తాజాగా ఒడిశాలో దారుణం జరిగింది. కర్పాబహాల్ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడి తల్లి ప్రమాదవశాత్తూ మృతిచెందింది. కానీ, ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊరులో ఒకరు కూడా తోడు రాలేదు.
తమకన్నా తక్కువ కులం వాడని ఎవరూ తోడు రాలేదు. తన తల్లి అంత్య క్రియలకు సహకరించండీ అంటూ ఆ యువకుడు గ్రామస్థుల ఎంతో దయనీయంగా వేడుకున్నారు. కానీ కఠిన హృదయులు ఏమాత్రం కనికరం చూపించలేదు. ఒక్కరి మనస్సు కూడా కరగలేదు. చివరకు చేసేదేమి లేక.. ఒక్కడే సైకిల్పై తన తల్లి మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. జాంకి సిన్హానియా(45), ఆమె కుమారుడు సరోజ్(17) కర్పాబహాల్ గ్రామంలో నివాసముంటున్నారు. కొంత కాలం క్రితం జాంకీ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.
ఆమె కూలీ పని చేస్తూ తన కొడుకును సాకుతుంది. ఈ నేపథ్యంలో మంచి నీళ్ల కోసం వెళ్లి ప్రమాద వశాత్తు బావిలో పడి చనిపోయింది. తన తల్లి అంత్యక్రియలకు సహకరించమని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం ఎంతో పురోగాభివృద్ది సాధిస్తుందని..కుల, మత ద్వేశాలు లేవంటూ రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.