ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత జగన్ ఎప్పుడైతే కేటీఆర్ తో భేటీ అయ్యాడో అప్పటి నుంచి టీడీపీ దూషణ పర్వం స్టార్ట్ చేసింది. ఫెడరల్ ఫ్రంట్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్తో మంతనాలు జరిపిన విషయం విదితమే. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్లో దుష్ప్రచారం షురూ చేసింది. ఓ వైపు చంద్రబాబు, ఇంకోవైపు ఆయనగారి తనయుడు నారాలోకేష్.. ఎడా పెడా స్పందించేస్తున్నారు.
సోషల్ మీడియాలో అయితే నారాలోకేష్ వేసిన ట్వీట్లు వైరల్గా మారాయి. అంతకన్నా వైరల్గా మారాయి లోకేష్కి తెలంగాణ సమాజం ఇస్తున్న కౌంటర్లు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆంధ్రప్రదేశ్లోనూ ఫెడరల్ ఫ్రంట్ విషయమై సానుకూల స్పందన లభిస్తుండడం. 'సింహం సింగిల్గా వస్తుంది..' అంటూ టీడీపీ మద్దతుదారులు కొందరు కామెంట్స్ చేస్తోంటే, 'అవునా.? మరి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పందుల గుంపు మాటేమిటి.?' అంటూ తెలంగాణ ఎన్నికల సమయంలో పొత్తుల వ్యవహారంపై నెటిజన్లు రిటార్టులతో విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికైతే వైఎస్ జగన్, తాము ఫెడరల్ ఫ్రంట్లో చేరుతున్నట్లు ప్రకటించలేదు. ఈలోగా తెలుగుదేశం పార్టీ తెగ ఆయాసపడిపోతోంది. టీడీపీ ఓవరాక్షన్, పరోక్షంగా ఫెడరల్ ఫ్రంట్కి బలం చేకూర్చేదిలానే కన్పిస్తోంది మరి. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు అత్యుత్సాహం కాస్తా కాంగ్రెస్ పార్టీని సైతం నిండా ముంచేసింది. మొత్తమ్మీద, 'రిటర్న్ గిఫ్ట్'కి సంబంధించి కేసీఆర్, దాదాపుగా అన్నీ సమకూర్చేసుకుంటున్నట్లే కన్పిస్తోంది. త్వరలో అమరావతిలో వైఎస్ జగన్తో కేసీఆర్ భేటీనే ఓ సంచలనం కాబోతోంది. ఆ రోజే, కేసీఆర్ - చంద్రబాబుకి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్పై పూర్తిక్లారిటీ రాబోతోందని అనుకోవచ్చు.