ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి మద్య తీవ్ర స్థాయిలో యుద్దం జరిగింది. టీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడించాలని ఉద్దేశంతో టి కాంగ్రెస్, టీటిడిపి, టిజెఎస్,సిపిఐ తో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. కానీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం అంతా తలకిందులైపోయింది. టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. ఇక ఎన్నికల సమయంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించిన వంటేరు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ని వీడి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువాను ఆయన కప్పుకోనున్నారు.
రేపు సాయంత్రం నిర్వహించే ఓ కార్యక్రమంలో ఒంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, 2014 ఎన్నికల్లో సైతం గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 60 వేలకు పైగా ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ కి, ముఖ్యంగా కేసీఆర్ కి బద్ధ వ్యతిరేకిగా ఉన్న వంటేరు పార్టీ మారడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.