వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు ఓ లెక్కలో ఉంటాయి. వర్తమాన రాజకీయాలకు భిన్నంగానే ఆయన పోకడలు ఉంటాయి. ఓట్లు, సీట్లు పేరిట ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న హంగామా ఓ ఎత్తు అయితే జగన్ మార్క్ తో తనదైన రాజకీయం చేయడం ఆయనకే చెల్లింది. దేన్ని అయినా ప్రజల ముందు తాను గట్టినా సమర్ధించుకోగలనన్న విశ్వాసం జగన్ లాంటి నేతలకు మెండుగా ఉండడమే ఇందుకు కారణం.
చివరి సమావేశాలు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలు త్వరలో జరగనున్నాయి. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 7 వరకూ జరితే ఈ సమావేశాల్లో ఓటాను అకౌంట్ ప్రవేశపెట్టడంతో పాటు, కీలకలమైన అనేక అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి దీని తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ మీదట ఎన్నికల్లో గెలిచిన పార్టీకే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. ఆ సర్కార్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది మొత్తంగా చూసుకుంటే ఇపుడు ఏపీలో ఈ లాస్ట్ సెషన్ కి ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ఎన్నికల కోసం వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జగన్ రెడీనా :
ఇక ఈ సమావేశాలకు వెళ్ళేందుకు జగన్ రెడీగా ఉన్నారా అన్న చర్చ ఇపుడు సాగుతోంది. జగన్ ఏడాదిన్నర పాటు పాదయాత్రలో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన తనతో పాటు ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపించలేదు. తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసి, అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ విధానాలను నిరసిస్తూ అసెంబ్లీకి బాయ్ కాట్ చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు.
దాంతో ఆయనపైన ఎన్నో విమర్శలు వచ్చాయి. అన్ని పార్టీలు కలసి అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన మీకు ఎందుకు ఓట్లు వేయాలని కూడా నిలదీశాయి. ఇదిలా ఉంటే జగన్ పాదయాత్ర ఇపుడు పూర్తి అయింది. మొత్తం పదమూడు జిల్లాల ప్రజానీకం సమస్యలు ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. దాంతో ఆయన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇదొక అవకాశంగా అంతా భావిస్తున్నారు. జగన్ ఇపుడు ఖాళీగానే ఉన్నారు కాబట్టి ఈ చివరి అసెంబ్లీ మీటింగుకు వస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది.
కడిగిపారేయొచ్చు :
జగన్ కనుక అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకుంటే అది వైసీపీ పాలిట బ్రహ్మాస్త్రమే అవుతుందని అంటున్నారు. తాను పాదయాత్రలో చూసిన సమస్యలతో పాటు, అన్ని విషయాలను జగన్ అసెంబ్లీ వేదికగా కడిగిపారేసి పార్టీకి మైలేజ్ తీసుకురావచ్చునని కూడా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ అసెంబ్లీకి వస్తే మచ్చను పోగొట్టుకోవడమే కాకుండా లాస్ట్ పంచ్ వేసే చాన్స్ కూడా దక్కుతుందని అంటున్నారు.
జగన్ ఈ విషయంలో పట్టుదలకు పోకుండా సానుకూలంగా ఆలోచన చేసే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలు పాలక పక్షం కంటే ప్రతిపక్ష వైసీపీకి ఎంతగానే ఉపయోగపడతాయి. బాబును అసెంబ్లీ సాక్షిగా ఇరకాంటంలో నెట్టే అవకాశం ఏపీలో ఒక్క వైసీపీకి మాత్రమే ఉంది. మిగిలిన పార్టీలకు అక్కడ ప్రాతినిధ్యమే లేనందున జగన్ ఈ బంగారు అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది ఆ పార్టీ నేతలతో పాటు ప్రజాస్వామ్య ప్రియులది కూడా. మరి జగన్ ఎలా స్పందిస్తారో.