సినీహీరో ప్రభాస్తో తనకు సంబంధం అంటకడుతూ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలని వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజింగ్ తీసుకుని విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో వెర్రితలలు వేస్తున్న దుష్ప్రచారం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో ప్రత్యేకించి యూట్యూబ్లో సెలబ్రెటీల గురించి విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. ప్రత్యేకించి పది మంది హీరోలు, ఐదుగురు హీరోయిన్లు, ముగ్గురు యాంకర్లపై ఈ దుష్ప్రచారం విపరీతంగా జరుగుతోందని వారు తెలుసుకున్నారు. అంతేకాదు.. వీటిని ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవడం అంతసులువు కాదని కూడా పోలీసులకు తెలిసొచ్చింది.
సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారం నిర్వహిస్తున్నవారు.. తమ అసలు చిరునామాలు వెల్లడించడం లేదు. అంతే కాకుండా ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి అప్లోడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం చాలా సులభం కావడం.. పోస్టింగ్ చేసేందుకూ పెద్ద టెక్నాలజీ తెలియాల్సిన అవసరం లేకపోవడంతో ఈ దుష్ప్రచారం సులభంగా మారింది.
ఇలా సోషల్ మీడియాలో బురద జల్లేవారిని పట్టుకోవడం అంత సులభం కాదని గ్రహించిన పోలీసులు ముందు ఈ వీడియో లింకులను తొలగిస్తున్నారు. సృష్టికర్తల వివరాలు ఇవ్వాలంటూ యూ ట్యూబ్, గూగుల్ కంపెనీలను లిఖితపూర్వకంగా కోరుతున్నారు. అసభ్య, అశ్లీల వీడియోలను నియంత్రించే వ్యవస్థ యూట్యూబ్కు లేకపోవడం కూడా ఓ కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వీటని అరికట్టడమెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు.