రాజకీయాల్లో తాడి తన్నేవాడుంటే.. తలతన్నేవాడు మరొకడు ఉంటాడని అంటారు! ఇప్పుడు ఇది నిజం కాబోతోందా? అనే రేంజ్లో ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. దేశానికి రాజకీయ పాఠాలు నేర్పించే స్థాయిలో ఉన్న చంద్రబాబు వంటి అపర చాణిక్యుడి ముందు జగన్ వ్యూహాలు పనిచేస్తాయా? అనే కీలక అంశం తెరమీదికి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ అధికార పీఠంపై కన్నేశారు. ఇప్పటికే అధికారంలో ఉండడం చంద్రబాబుకు, ప్రతిపక్షంలో ఉన్న జగన్కు కూడా కలిసి వస్తున్న అంశాలు. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అధికారం అప్పగించేందుకు ప్రజలు రెడీ గా ఉన్నారని వైసీపీ నాయకులు అంటుండగా.. తమ పథకాలే తమకు తిరిగి అధికారాన్ని అప్పగిస్తాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు, ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నా.. ఇప్పటికిప్పుడు జనవరిలో ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తున్న విషయం. సుదీర్ఘ పాదయాత్రను ముగించుకున్న జగన్ తన రేటింగ్ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అదేసమయంలో చంద్రబాబు కూడా సామాజిక పింఛన్లను పెంచడం ద్వారా అదే స్తాయి రేటింగ్ను మించి పోయారు. ఇక, పార్టీలోనూ ఆయన తమ్ముళ్లను అలెర్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పగలు ప్రజల కోసం.. రాత్రిళ్లు పార్టీ కోసం అన్నట్టుగా చంద్రబాబు టైంటేబుల్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక, జగన్ కూడా తనకు కలిసి వచ్చేవారితో కలిసి అడుగులు వేసేందుకు ముందుకు వేస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా జగన్ అడుగులు పడతాయా? అనేది సందేహంగానే ఉంది. తాను ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీకొట్టారని జగన్ అంటున్నారు. ఈ క్రమంలోనే పింఛన్లను పెంచారని చెబుతున్నారు. అయితే, దీనికి తగిన విధంగా ప్రచారం కల్పించుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అదేసమయంలో కీలకమైన నాయకులు చేజారిపోతుండడం జగన్కు ఇబ్బందికరంగా మారుతున్న పరిణామం.
ఈ శంక చంద్రబాబులోనూ ఉంది. కీలకమైన రాజధాని ప్రాంతంలోనే ఒకరిద్దరు టీడీపీ నాయకులు చంద్రబాబుకు హ్యాండిచ్చేందుకురెడీగా ఉన్నారనే సమాచారం వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నాయకులు అలెర్ట్ అయ్యారు అయితే, ఇప్పటికిప్పుడు మాత్రం అటు టీడీపీ, ఇటు వైసీపీలు ఒకే రేంజ్లో దూసుకు పోతున్న తీరు మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎవరు ముందు? అనే విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి కూడా. మరి ఈ నేపథ్యంలో ప్రజలను మరింత ఆకట్టుకునేందుకు ఈ ఇద్దరూ ఎలా దూకుడు ప్రదర్శిస్తారో చూడాలి.