తెలుగు రాష్ట్రా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన మహానటులు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 23వ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన గుర్తుగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ గొప్ప నటుడిగానే కాకుండా మంచి రాజకీయ నేతగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని..అందుకే ఆయనను గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని, చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడని అన్నారు.
ఎన్టీఆర్ తో ఎవరూ పోటీ పడలేరని, ఆయనకు ఆయనే సాటి అని ప్రశంసించారు. అంతే కాదు తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి, సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని నిర్వచించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. తారకరామనగర్ లో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సాగర్ లో బోటులో చంద్రబాబు, స్పీకర్ కోడెల విహరించారు.