అవును నెల్లూరు జిల్లా
తెలుగుదేశంపార్టీలో మెల్లిగా కలకలం మొదలైంది. అందుకు కారణం సీనియర్ నేత ఆదాల
ప్రభాకర్ రెడ్డి మౌనం. దాదాపు మూడు నెలలుగా ఆదాల టిడిపి కార్యక్రమాల్లో పెద్దగా
కనబడటం లేదు. టిడిపి నేతలతో కూడా పెద్దగా టచ్ లో ఉండటం లేదట. తానుగా ఎవరి దగ్గరకు
వెళ్ళి మాట్లాడటం లేదని సమాచారం. ఎవరైనా తన వద్దకు వస్తే మాత్రమే
మాట్లాడుతున్నారు. దాంతో ఆదాల మనసులో ఏముందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకపుడు ఆదాల
వైసిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగినా అప్పట్లో ఆదాల ఆ వార్తలను ఖండించేవారు.
కానీ ఇఫుడు అదే ప్రచారం జరుగుతున్నా ఏమీ మాట్లాడటం లేదు. దాంతో టిడిపి నేతల్లో
అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఆమధ్య చంద్రబాబునాయుడు సమక్షంలో నెల్లూరు నేతల సమావేశం జరిగింది. ఆ సమయంలో నెల్లూరు ఎంపిగా పోటీ చేస్తారని చంద్రబాబు ఫైనల్ చేశారు. అదే విషయాన్ని నెల్లూరులో తనను కలసిన నేతలతో కూడా ఆదాల ప్రకటించారు. కానీ జిల్లాలోని ముఖ్య నేతల మధ్య ఏమైందో స్పష్టంగా తెలియలేదు. అప్పటి నుండో ఆదాల సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వం, పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కూడా పెద్దగా కనిపించలేదు. ఒకపుడు ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించేవారు. జిల్లా పార్టీ సమావేశాల్లో కూడా క్రమం తప్పకుండా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు.
జిల్లాలోని ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆదాలకు సఖ్యత చెడిందని సమాచారం. ఒకపుడు ఆదాల ఆత్మకూరులో కానీ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే రెండు నియోజకవర్గాల్లోను అవకాశం దక్కలేదు. రెండుచోట్ల చంద్రబాబు చాయిస్ వేరే ఉన్నారని అంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు గట్టిగా చెప్పటంతో ఒప్పుకోవాల్సొచ్చిందట. మంత్రులిద్దరూ చంద్రబాబుతో చెప్పి తెరవెనుక నుండి తనకు వ్యతిరేకంగా రాజకీయం చేశారన్న భావన ఆదాలలో పెరిగిపోయిందట. జిల్లాలో బీద సోదరులైన మస్తాన్ రావు, రవిచంద్రతో కూడా విబేధాలు మొదలైందట.
ఆదాల వ్యవహారం చూసిన తర్వాత పార్టీలోని సీనియర్ నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు పిలవటం తగ్గించేశారట. అందుతున్న ఆహ్వానాలు కూడా ఏదో మొక్కుబడిగా అందుతున్నాయని సమాచారం. కానీ ముఖ్యనేతల సమావేశాల్లో మాత్రం చాలామంది నేతలు ఆదాలను దూరంగానే పెడుతున్నారట. ఇటువంటి ఘటనలే ఆదాలకు, టిడిపికి దూరం పెంచేస్తున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పార్టీలో తలెత్తుతున్న ఇటువంటి పరిణామాలు అందరినీ గందరగోళంలో పడేస్తున్నాయ్.
ఒకవేళ ఆదాల గనుక నిజంగానే టిడిపిని వదిలేస్తే పెద్ద దెబ్బే అనటంలో సందేహం అవసరం లేదు. ఆదాల ఆర్దిక, అంగబలంలో బాగా గట్టి నేతే. అందుకే ఆదాలను వదులు కోవటానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. కానీ జిల్లాలోని మంత్రులు, నేతలతో ఆదాలకు ఏమాత్రం పడటం లేదు. సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఒకవైపేమో చంద్రబాబు పాలనసై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత. మరోవైపు టిడిపి తరపున ఎక్కడ పోటీ చేసినా గెలిచేది అనుమానమే. ఇటువంటి పరిస్దితుల్లో మనస్పూర్తిగా పోటీ చేయలేక, పార్టీ నేతలతో నెట్టుకురాలేక ఆదాల అవస్తలు పడుతున్నారన్నది వాస్తవం. ఇది ఒక్క ఆదాల విషయంలో మాత్రమే కాదట. మరి కొందరు నేతలు కూడా ఇదే స్దితిని ఎదుర్కొంటున్నారట. మరి ఎన్నికల్లోపు టిడిపిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.