వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల తనపై ఇంటర్నెట్లో దుష్ప్రచారం చేస్తున్నారని పెట్టిన కేసుపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షర్మిల ప్రతిష్టకు భంగంవాటిల్లేలా యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఓ బీటెక్ చదువుతున్న యువతి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు యూట్యూబ్లో దాదాపు 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చానల్స్కు సంబంధించినవో గుర్తించారట. వీటికి బాధ్యులైన మొత్తం 15 మందిని గుర్తించారట. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకన్నారట. విచారణ అనంతరం వీరిని నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు జారీ చేశారు.
వీరిలో ఓ బీటెక్ చదివిన యువకుడు షర్మిల.. సినీహీరో ప్రబాస్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు కామెంట్ చేస్తూ వీడియో రూపొందించాడని గుర్తించారు. మరో యూట్యూబ్ ఛానల్లోనూ ఇలాంటి వ్యాఖ్యానాలున్నాయట. సదరు ఛానల్ యజమానిని ప్రశ్నిస్తే.. కిందిస్థాయి సిబ్బంది కారణంగానే ఇలాంటి పొరపాటు జరిగి ఉండొచ్చని చెబుతున్నారట.
మొత్తం మీద నిందితులంతా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారేనట. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారితోపాటు ఈ వీడియోలకు కామెంటే చేసిన వ్యక్తులు కూడా నిందితులే అవుతారట. యూట్యూబ్ స్థానిక ప్రతినిధుల సహాయంతో మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారట పోలీసులు.