భారత దేశంలో పరమ పుణ్య స్థలంగా పేర్కొనబడే శబరిమల అయ్యప్ప సన్నిధిలో కొంత కాలంగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కాగా, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇప్పటివరకూ 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు 51 మంది ఆలయంలో ప్రవేశించారని కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్లో పేర్కొంది. శబరిమల అయ్యప్ప ని దర్శించుకోవాలంటే పది సంవత్సాల లోపు..50 సంవత్సరాల పై బడి ఉన్న వారికే అనుమతి ఉండేది. రుతు క్రమం కొనసాగే మహిళలకు ఆలయ ప్రవేశం లేదు.
ఇక శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. పది నుంచి 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశం సంప్రదాయాలకు విరుద్ధమని హిందూ సంఘాలు సుప్రీం తీర్పుపై భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి 50 ఏండ్లలోపు మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఇప్పటివరకూ 51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వారంతా 50 ఏండ్ల లోపు వారేనని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించిన జాబితాను సుప్రీంకోర్టుకు శుక్రవారం అందజేసింది. శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం సుమారు 16 లక్షల మంది భక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,564 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా 10-50 ఏండ్ల మధ్య వయస్కులే. ఇందులో 51 మంది మహిళలు ఇప్పటికే అయ్యప్పను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 2న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులు ఆందోళనకారుల నిరసనలను నిలువరిస్తూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.