జగన్ పై జరిగిన దాడి కేసు ను ఎప్పుడైతే ఎన్ ఐ ఏ కు బదిలీ అయిందో అప్పటి నుంచి టీడీపీ నేతలు మాట్లాడ్తున్న మాటలు విమర్శలుకు గురవుతున్నాయి. అయితే ఎన్ఐఏ విచారణ జరిగితే ఆ విషయాలే కదా బయటకు వచ్చేది. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి అంత ఆందోళన ఎందుకు? అనేది సగటు పౌరుడిలో కలిగే అనుమానం. మరో విశేషం ఏమిటంటే.. ఎన్ఐఏ విచారణ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లబోతోంది అనేది. ఈ కేసులో ఎన్ఐఏ విచారణను ఆపించేయాలని కోర్టును కోరనున్నారట. ఈ మేరకు ఆలోచనలు సాగుతున్నాయని, ఏపీ ప్రభుత్వం వైపు నుంచి పిటిషన్ దాఖలు అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
అదే జరిగితే.. ఈ కేసులో మరిన్ని అనుమానాలు రేగే అవకాశాలున్నాయి. ఎన్ఐఏ విచారణకు ఇప్పటికే ఏపీ పోలీసులు సహకరించడం లేదని కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అటు సహకరించకపోవడం, ఇటు ఎన్ఐఏ విచారణను ఆపాలంటూ కోర్టుకు వెళ్లడం.. ఈ రెండూ జరిగితే, దేన్నో దాచడానికి గట్టి ప్రయత్నమే సాగుతోందని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.
ఈ విషయంపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడని, ఏపీలోని ఒక ముఖ్యనేత ఆశీస్సులతో.. ఈ వ్యవహారాన్ని అంతా ఢిల్లీలోని వ్యక్తి సమీక్షించాడని.. చాలామంది చెప్పుకుంటున్నారు. ఎన్ఐఏ విచారణ ధాటిగా కొనసాగితే... అటు ఢిల్లీలోని వ్యక్తి ముందుగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్ఐఏ విచారణను ఆపించడానికి గట్టిగా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం!