రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుని ముందుకు వెళ్లిన వారిదే విజయం. పిడివాదానికి తావులేని నేటి రాజ కీయాల్లో ఒకరికోసం మరొకరు వేచి చూడడం, లేనిదానికోసం వెంపర్లాడడం వంటివి చేయడం వల్ల ఉన్నది కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలిని గమనిస్తున్న ఆ పార్టీ సానుభూతి పరులు కూడా పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వేయాల్సిన అడుగులు.. జగన్ ఇక్కడ ఉనికిలోకూడా లేకుండా పోతున్న బీజేపీ కోసం పణంగా పెడుతున్నారా? అనే సందేహాలు కొన్నాళ్లుగా తెరమీదికి వస్తున్నాయి. అధికార పార్టీ టీడీపీ చెబుతూ వస్తున్న అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటే .. ఇదే విషయం స్పష్టమవుతోంది.
ప్రత్యేక హోదా విషయం అనేది రాజకీయ బ్రహ్మాస్త్రంగా ప్రతి పార్టీకీ ఉపయోగ పడేదే. గత ఎన్నికలలోనే ఈ విషయంపై పెద్ద ఎత్తున హామీలు వచ్చాయి అయితే, ఇది సాకారం కాలేదు. అధికారంలోకి వచ్చి న టీడీపీ కూడా దీనిని సాధించడం లో వెనుకబడి పోయింది. వచ్చే ఎన్నికల్లో నూ ఇది పెద్ద ఎత్తున ప్రచారానికి కేంద్రంగా మారనుంది. అయితే, ఆది నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడిన నాయకుడు జగన్. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే..ఆయన హోదా కోసం రెండు మూడు విధానాల్లో ఉద్యమాలు చేశారు. యువ భేరి పేరుతో ప్రతి కాలేజీకి తిరిగి యువతలో హోదాపై ఆశలు రేకెత్తించారు. అదేవిధంగా ఎవరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించినా.. ఆయన మద్దతు పలికారు.
తొలిసారిగా ఇదే విషయం ప్రాతిపదికన కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించింది కూడా జగనే. ఇక, తన మీడియా ద్వారా కూడా ప్రత్యేక హోదా వస్తే..రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేక కథనాలు ప్రసారం చేశారు. ప్రచురించారు కూడా! మరి ఇంతగా హోదా కోసం ప్రయత్నించిన జగన్ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయా రు. అప్పట్లో హోదా వద్దన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు దీనికోసమే కేంద్రంతో పోరాటం ప్రారంభించి మార్కులు కొట్టేస్తోంది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం వంటివి ఎన్నికల్లో అస్త్రాలుగా మారుతున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ అసలు సిసలు వేడి రగిలంచనుంది.
అయితే, ఆ యా విషయాలను ఇప్పుడు జగన్నా మమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. ప్రచారానికి ఉత్సాహం కూడా చూపించడం లేదు. మరి ఇంతగా జగన్ ఎందుకు మారిపోయారు? ఇప్పుడు ఇదే మేదావులను సైతం ఆలోచనలో పడేసిన ప్రశ్న. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏముహూర్తాన కన్నా లక్ష్మీనారాయణ ఈ పార్టీ పగ్గాలు చేపట్టారో .. పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా.. కీలకమైన ఆకుల సత్యనారాయణ వంటి నాయకులు పార్టీ మారుతున్నారు. అదేసమయంలో మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఊగిసలాడుతున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నారు. దీనిని బట్టి బీజేపీ అస్సలు ఒక్క సీటు కాదుకదా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్తితి లేదు. అలాంటి పార్టీ కోసం జగన్ ఇలాంట అవకాశాలను వదులుకుంటే.. మొత్తంగా ఆయనే మునిగిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.