ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర బదిలీల సమస్యలను పరిష్కరించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని జగన్ కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని ఆహ్వానించేందుకు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ జగన్ను కలిసిన సంగతి తెలిసిందే.
కేటీఆర్-జగన్ మీటింగ్పై మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు స్నేహహస్తం చాచడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. ఇది తమ పార్టీకి నష్టమని వైసీపీ శ్రేణుల్లో కూడా కాస్త ఆందోళన కనిపిస్తోంది.
ఈ సమయంలో టీఆర్ఎస్ తో భేటీ ఫెడరల్ ఫ్రంట్ కోసమేని చెప్పడం ద్వారా డ్యామేజీ కంట్రోల్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ తో దోస్తీ ద్వారా ప్రత్యేక హోదా సాధన సులభమవుతుందని కూడా అంటోంది. ఈ పరంపరలో భాగంగానే అంతర్రాష్ట్ర బదిలీల సమస్యలను పరిష్కరించాలంటూ జగన్ కేసీఆర్కు లేఖ రాసినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.