టీడీపీ - జనసేన మధ్య మళ్లీ పొత్తు పొడిచినట్టే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ మోడీ, కేసీఆర్, జగన్, పవన్ తనను టార్గెట్ చేస్తున్నారని ఆడిపోసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ లిస్టులో నుంచి పవన్ను తప్పించేశారు. అంతే కాదు.. పవన్ తనతో కలసి పనిచేయాలని చెబుతున్నారు.
మరోవైపు టీడీపీతో పొత్తును ఖండించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై మాత్రం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు. ఏకంగా కేసీఆర్, జగన్ కలసి ఏపీపై కుట్ర చేస్తున్నారని భయం వేస్తోందంటూ కామెంట్ చేయడంతో ఆయన రాజకీయ శీలంపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. బాబు-పవన్ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశం నేతలు ఎవరూ విమర్శలు చేయవద్దని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చేశారట. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న ప్రచారం ఉధృతం చేయాలని పార్టీ నేతలకు హితబోధ చేసిన చంద్రబాబు.. పవన్ జోలికి మాత్రం వెళ్లొద్దని చెప్పేశారట. సీనియర్ నేతలు కొందరు మరి పవన్ ను కూడా తిట్టాలి కదా అని అడిగితే.. చెప్పిందే చేయండి.. అంతే అంటూ గట్టిగా చెప్పేశారట చంద్రబాబు.
తాను మళ్లీ చెప్పేవరకూ టీడీపీ నేతలెవరూ పవన్ జోలికి వెళ్లవద్దని సీరియస్గా చెప్పేశారట చంద్రబాబు. సో.. పవన్ తో పొత్తు పొడిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అటు పవన్ కూడా తాజాగా టీడీపీ సర్కారుపై విమర్శలేమీ చేయలేదు. గతంలో బాబు, లోకేశ్లను అవినీతిపరులంటూ విమర్శించిన పవన్ గళం కొద్దిరోజులుగా మూగబోవడం కూడా ఆసక్తికరంగా మారింది.