తెలంగాణాకి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రసమితి అధ్యక్షుడు కలవకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు. 82 % శాసనసభ స్థానాలని అంటే 89 + 8 మిత్రుల స్థానాలు గెలుచుకున్న సార్వభౌముడు. కాంగ్రెస్ పార్టీ - టిడిపి సో కాల్డ్ పీపుల్స్ ఫ్రంట్ అనే ప్రతిపక్షానికి శాసనసభలో 21 స్థానాలు గెలుచుకున్నా సరిగ్గా మాట్లాడే దమ్ములేదు. ప్రతిపక్షం బ్రతికి చస్తుంది. ఈ పరిస్థితు ల్లో ఒకేఒక్క బిజెపి శాసనసభ్యుడు రాజసింగ్ కేసీఆర్ ను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు.
*రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు చాలా మంది సినీ సెలబ్రిటీ లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కొందరు పోలీసు విచారణను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరి పేర్లు కూడా పోలీసుల జాబితాలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. అంతలా దుమారం రేపిన ఈ కేసు ఒక్కసారిగా చల్లబడి పోయింది. విచారణ నెమ్మదించి పోయింది ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారం ఊసే లేకుండా పోయింది. దీంతో సినీ పెద్దలు ప్రభుత్వంతో వ్యవహారాన్ని చక్కబెట్టారని, అందుకే కేసు విచారణ అటకెక్కిందనే మాట కూడా వినబడింది. అవన్నీ ఎంత వరకు నిజమో! గానీ తాజాగా ఈ డ్రగ్స్ కేసు మరో సారి తెరమీదకు వచ్చింది.
తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి శాసనసభలో డ్రగ్స్ అంశం చర్చకు వచ్చింది. బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ అంశాన్ని లేవ నెత్తారు. అప్పట్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు ఏమైందని, ఆ విచారణ అర్ధారంతరంగా ఎందుకు ఆగిపోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
*క్రికెట్ బెట్టింగ్ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో? చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ధూల్పేటలో సారా తయారీని ఆపేశారని వారి కుటుంబాలకు ప్రత్యా మ్నాయ ఆదాయ మార్గాలను చూపాలని కోరారు.
*ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, డాక్టర్లు హెల్మెట్లు రక్షణగా పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొందని అసెంబ్లీలో రాజాసింగ్ చెప్పారు. ఆస్పత్రిని ఆధునికంగా నిర్మిస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
*ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.
*కంటి వెలుగు పథకం ఉద్దేశం మంచిదే కానీ ఇప్పటివరకు ఎంతమందికి శస్త్ర చికిత్సలు చేశారని ప్రశ్నించారు.
కొందరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో కలిసి వెళ్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ఎంఐఎంపై పరోక్ష విమర్శలు చేశారు. అవకాశవాద పార్టీకి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చక్కని గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని ప్రశంసిస్తూనే సీఎం కేసీఆర్ కు ప్రశ్నించేవారు ఒకరున్నారని చెప్పకనే చెప్పారు.