ఎక్కడో స్విచ్చేస్తే ఎక్కడో ఉన్న బల్బు
వెలిగినట్లుగా ఉంది టిడిపి ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు పరిస్దతి. వైసిపికి మాజీ
ఎంఎల్ఏ వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేస్తే బోండా ఉలిక్కిపడుతున్నారు. బోండాలో టెన్షన్
పెరిగిపోతోంది. అందుకు కారణం ఏంటి ? కారణాలు తెలియాలంటే ఈ కథనం చదవి తీరాల్సిందే.
రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని రాధా అనుకున్నారు.
అయితే, ఆ సీటును మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్
నియోజకవర్గంలో టిక్కెట్టు ఫైనల్ అయిపోయింది కాబట్టి విజయవాడ తూర్పు నుండి లేదా
మచిలీపట్నం ఎంపిగా పోటీ చేయాలని
సూచించారు.
నిజానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా గట్టి అభ్యర్ధే ఉన్నారు. టిడిపిలో ఉన్న యలమంచిలి రవికి విజయవాడ తూర్పు నియోజకవర్గం టిక్కెట్టిస్తానంటేనే రవి టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. సరే టిక్కెట్టు విషయంలో రవికి జగన్ ఏదో నచ్చ చప్పుకోవచ్చని అనుకునే తూర్పులో పోటీ చేయమని సూచించారు. అయితే రాధా దృష్టి అంతా సెంట్రల్ నియోజకవర్గం పైనే ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో టిక్కెట్టు సాధ్యం కాదని జగన్ తేల్చి చెప్పటంతోనే రాధా టిడిపికి రాజీనామా చేసేశారు.
ఇంత వరకూ బాగానే ఉందికానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. రాధా వైసిపిలో ఉన్నంత కాలం టిడిపిలోకి లాక్కోవాలని బోండా, బుద్ధా లాంటి నేతలు పదే పదే రాధాను తెగ గోకారు. ఎప్పుడైతే రాధా వైసిపికి రాజీనామా చేశారో వెంటనే బోండా ప్లేటు ఫిరాయించేశారు. టిడిపిలో రాధా చేరినా పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేదని ఏకపక్షంగానే తేల్చేశారు. ఇంతకీ బోండాలో భయం ఏమిటంటే, ఒకవేళ రాధా టిడిపిలో చేరితే సెంట్రల్ నియోజకవర్గంలో టిక్కెట్టుపై గురి పెడతారు. చంద్రబాబు నుండి అందుకు తగిన హామీని తీసుకునే పార్టీలో చేరుతారు. అప్పుడు బోండా పరిస్ధితి ఏంటి ?
ఒకవేళ సెంట్రల్ నియోజకవర్గంలో టిక్కెట్టును చంద్రబాబు హామీ ఇవ్వకపోతే రాధా టిడిపిలో చేరరు. ప్రత్యామ్నాయంగా జనసేనలో చేరుతారు. ఎటూ టిడిపి, జనసేనల మధ్య పొత్తు పొడుపులు చిగురిస్తున్నాయి కదా ? కాబట్టి జనసేనలో చేరి టిడిపితో పొత్తుల్లో సెంట్రల్ నియోజకవర్గం కోసం పవన్ కల్యాణ్ పట్టుబట్టేట్లు రాధా పవన్ ను ఒప్పిస్తారు. రాధా కోసమైతే చంద్రబాబు సెంట్రల్ టిక్కెట్టివ్వకపోవచ్చు. అదే సీటును పవన్ పట్టు బడితే ఇవ్వక తప్పదు. ఎందుకంటే, జనసేనతో పొత్తుల కోసం చంద్రబాబు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
కాబట్టి టిడిపిలో దక్కని సీటును రాధా జనసేన వైపు నుండి నరుక్కునొస్తారు. అంటే రాధా వల్ల తక్షణ సమస్య బోండాకే ఉంటుంది. జనసేనకు సెంట్రల్ టిక్కెట్టును చంద్రబాబు వదులుకుంటే అప్పుడు రాధా జనసేన తరపున పోటీలో ఉంటారు. మరి అపుడు సిట్టింగ్ ఎంఎల్ఏ బోండా ఏం చేస్తారన్నది చూడాలి. అందుకే బోండాలో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకే రాధా టిడిపిలో చేరితే పోటీ చేయటానికి అసెంబ్లీ నియోజకవర్గమే లేదని చెబుతున్నారు. సిట్టింగులను కాదని చంద్రబాబు రాధాకు టిక్కెట్టిచ్చేంత సీన్ కూడా లేదని బోండానే తేల్చేశారు. తాజాగా మాటలు వింటుంటే రాధా రాజీనామా ఎఫెక్ట్ బోండాలో ఏ స్ధాయిలో పడుతోందో అర్ధమైపోతోంది.