కేసీఆర్కు యజ్ఞయాగాదులపై అపరిమితమైన విశ్వాసం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తెలంగాణ ఏర్పడక ముందు కూడా పలు యాగాలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా యాగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన నిన్నటి నుంచి తన వ్యవసాయ క్షేత్రంలో యాగాలు చేస్తున్నారు.
ఐతే.. కేసీఆర్ ప్రధాని కావాలనే యాగాలు చేస్తున్నారని ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ న్యూస్ 18 ఓ కథనం వెలువరించింది. కోల్కతాలో విపక్షాల ఐక్య సభకు హాజరుకాని కేసీఆర్.. ప్రధాని అయ్యేందుకు మూడు యాగాలు చేస్తున్నారని ఆ సంస్థ తన కథనంలో పేర్కొన్నది. ఈ యాగం ఐదు రోజులు జరగనుందని.. 200 మంది వరకూ రుత్విక్కులు పాల్గొంటున్నారని తన కథనంలో తెలిపింది.
ఈ కథనాన్ని గమనించిన ఓ నెటిజన్.. దాన్ని కేటీఆర్ ట్విట్టర్కు పంపారు. కేటీఆర్ గారూ.. ఇదేదో ఫేక్ న్యూస్ లా ఉంది. ప్రధాని పదవి కోసం యాగాలు చేస్తున్నట్టు కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు కదా.. అంటూ కామెంట్ చేశారు. మీరు దీనిపై స్పందించాలని కోరాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మీడియా సంస్థలు కామన్సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయంటూ రీ ట్వీట్చేశారు.
కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నాయని.. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటి వాటిని పట్టించుకోవద్దని సదరు నెటిజన్కు తెలిపారు. మరి పత్రికలు కూడా సరైన ఆధారాలు, పరిశోధన లేకుండా కథనాలు రాస్తే ఇలా అక్షింతలు వేయించుకోవాల్సి వస్తుంది.