భారత దేశ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ మద్య హోరాహోరీ యుద్దమే కొనసాగుతుంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుతూ వచ్చింది. ఇక గాంధీ కుటంబం నుంచి వారసురాలిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్.. ఓ మంచి స్ట్రాటజీ అమలు చేశారని కొందరు పార్టీ సీనియర్లు అంటున్నారు.
ప్రియాంక గాంధీ.. తన తల్లి, సోదరుడికి పలు సందర్భాల్లో సహకరించినా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి మాత్రం రాలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమెను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ప్రియాంక గాంధీ చూడటానికి నాయినమ్మ ఇందిరా గాంధీ పోలికలు కలిగి ఉన్నాయని అంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్ కూడా తూర్పు యూపీలోనే ఉంటుంది. దీంతో ఇక యూపీ ఎన్నికల భేరీ రసవత్తరంగా మారనున్నది.
గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రియాంకా గాంధీ కొంత పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ 73 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఎన్నికల్లో రెండు సీట్లును మాత్రమే కైవసం చేసుకున్నది. రాయ్బరేలీ, అమేథీలో తల్లీకొడుకులు సోనియా, రాహుల్ మాత్రమే గెలిచారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలా పనిచేస్తారో చూడాలి. ఫిబ్రవరిలో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు.