సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకూ ఈ కేసులో 15 మంది వరకూ పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. మొత్తం 60 వరకూ యూట్యూబ్ ఛానల్స్ షర్మిలపై నెగిటివ్ ప్రచారం చేసినట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం 15 మందిలో 8 మందిని నిందితులుగా తేల్చారు. వీరందరికీ సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. వీరిపై చార్జ్ షీటు నమోదు తర్వాత వీరిపై కోర్టులో విచారణ ఉంటుంది. కేవలం వీడియోలు యూట్యూబ్లో పోస్టు చేసిన వారినే కాకుండా అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. యూట్యూబ్ లో వీడియోలు చూసిన తర్వాత చాలా మంది కింద కామెంట్లు రాస్తుంటారు. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో అడ్డూఅదుపు లేకపోవడంతో ఈ కామెంట్లు చాలా వరకూ అసహ్యకరంగా ఉంటున్నాయి.
షర్మిల వీడియోలపైనా ఇలా అసభ్యకరంగా చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు వారందరిపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా కామెంట్ చేసిన మెయిల్ ఐడీలను గుర్తించిన పోలీసులు వారి లాగిన్, ఐపీ వివరాలు సేకరిస్తున్నారు.