ఎక్కడైనా అధికార పార్టీ ముఖ్య మంత్రి కి , మంత్రుల కు లేఖలు రాయటం చూసాము కానీ , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఏకంగా అధికార పార్టీ టీడీపీ మంత్రులు ప్రతి పక్ష నేత జగన్ కు లేఖలు రాశారు. ఏమని రాస్తున్నారు.. ఆ సమస్య పరిష్కారం కాలేదు.. ఈ సమస్య ఇలా అయింది.. తెలంగాణ, ఏపీ మధ్య ఈ తగాదాలు వచ్చాయి.. ఇలా రాస్తున్నారంటే అర్థం ఏమిటంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిపోయారని, ఆయనను విమర్శించడానికి ఈ సమస్యలతో లేఖలు రాస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ఆ ఉత్తరాలు ఉంటున్నాయి. తెలుగుదేశం నేతల తెలివితక్కువ తనానికి అది ఒక నిదర్శనమనుకోవాలి. లేకుంటే అతి తెలివి అయినా అయి ఉండాలి.
గతంలో ఎన్నడూ అధికార పార్టీలో ఉన్నవారు ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని ప్రతిపక్ష నేతకు ఇలా లేఖలు రాయలేదు. మహా అయితే తాము ఈ పనులు చేశాం.. ఈ పనులు ఇంకా ఉన్నాయి.. ఈ సమస్యలు ఇలా ఉన్నాయి.. అని ప్రజలకు బహిరంగ లేఖలు రాసేవారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయా అంశాలపై లేఖలు రాస్తుంటారు. కాని ఏపీలో రివర్స్ నడుస్తోంది. తద్వారా ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని స్వయంగా మంత్రులే ఒప్పుకుంటున్నారన్నమాట. ఉదాహరణకు తాజాగా మంత్రి కొల్లు.రవీంద్ర రాసిన లేఖనే తీసుకుందాం.. అందులో ఆయన ఏమిరాశారు.
తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న విభజన సమస్యలు తీరకపోవడానికి కారణం కేసీఆర్ అని ఆరోపించారు. అంతవరకు అభ్యంతరం లేదనుకుందాం. తొమ్మిది, పది షెడ్యూల్ సంస్థల ఆస్తుల విభజన తదితర అంశాలలో ఏపీకి అన్యాయం జరుగుతోంది.. దానికి కారణం టీఆర్ఎస్ అని వారు చెబుతున్నారు. ఏపీ విద్యార్థులకు నష్టం జరిగింది.. ఇలా పలు అంశాలు రాశారు. మరి ఇంతకాలం అధికారంలో ఉన్నది ఎవరు? గవర్నర్ వద్దకు రెండు రాష్ట్రాల తరపున మంత్రుల కమిటీలు వెళ్లినప్పుడు ఎందుకు వారు నోరు విప్పలేదు? సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆద్వర్యంలోనే గవర్నర్ వద్ద భేటీ అయ్యారు కదా.. అంతదాకా ఎందుకు అనంతపురంలో మంత్రి పరిటాల సునీత కుమారుడు వివాహానికి కేసీఆర్ వెళ్లినప్పుడు ఎక్కడలేని హడావుడి చేసింది తెలుగుదేశం నేతలే కదా..