తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారకరామారావు మనవడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ వైసిపిలో చేరారు. హితేష్ చెంచురామ్ ఎన్టీయార్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి, అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వైసిపిలో చేరటం ద్వారా రాబోయే ఎన్నికల్లో చెంచురామ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నారు. తండ్రి, కొడుకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చెంచురామ్ లోటస్ పాండులోని నివాసంలో జగన్ ను కలిశారు. వైసిపిలో చేరాలన్న తమ అభిమతాన్ని చెప్పగా జగన్ కూడా సాధరంగా ఆహ్వానించారు.
త్వరలో మంచి రోజు చూసుకుని వైసిపిలో చేరనున్నట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. లేకపోతే తొందరలోనే జిల్లా యాత్రలకు జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఆ యాత్రల్లో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చినపుడైనా చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దాంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చెంచురామ్ వైసిపిలో చేరబోతున్నారే ప్రచారానికి తెరపడినట్లైంది. జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేయటానికి చెంచురామ్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అదే విషయంపై గంటపాటు జరిగిన భేటీలో జగన్ కూడా హామీ ఇచ్చారని సమాచారం. నిజానికి పర్చూరులో పోటీ చేసే విషయమై దగ్గుబాటి దంపతులు చెంచురామ్ ను ఎప్పటి నుండో నియోజకవర్గంలో ప్రముఖులందరికీ పరిచయం చేస్తునే ఉన్నారు.
చెంచురామ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోగానే వైసిపినే ఎంచుకున్నారు. దగ్గుబాటి దంపతులతో ఉన్న కుటుంబ, రాజకీయ వైరం కారణంగా దగ్గుబాటి దంపతులు ఎలాగూ తెలుగుదేశంపార్టీలో చేరలేరు. అదే సమయంలో బిజెపిలో పురంధేశ్వరి ఉన్నారన్న మాటే కానీ ఆ పార్టీకున్న బలమెంతో అందరికీ తెలుసు. అందుకనే వేరే ఆలోచన లేకుండా దగ్గుబాటి దంపతులు వైసిపినే ఎందుకున్నారు. ఇక, పురంధేశ్వరి విషయమే ఫైలన్ కావాల్సుది.
అదే విషయమై దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ, తన భార్య బిజెపిలోనే ఉంటుందన్నారు. కొడుకు వైసిపిలో చేరటం వల్ల తనకు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందని అనుకుంటే రాజకీయాలకే దూరంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ అందులో వాస్తవం లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే, కొడుకు వైసిపిలో ఉండగా పురంధేశ్వరి ఎంతో కాలం బిజెపిలో ఉండలేరన్నది వాస్తవం.
బిజెపిలో పురంధేశ్వరి యాక్టివ్ గా ఉన్నారన్నది నిజమే అయినప్పటికీ మనసంతా కొడుకు రాజకీయ అరంగేట్రంపైనే ఉందన్నది కాదనలేని నిజం. అందుకనే చెంచురామ్ కు పర్చూరులో టిక్కెట్టు ఖాయమైపోగానే ఆమె కూడా బిజెపికి రాజీనామా చేసేస్తారని సమాచారం. అవకాశం ఉంటే ఒంగోలు పార్లమెంటు సీటులో పురంధేశ్వరి పోటీ చేసేట్లు లేకపోతే ఎన్నికలైపోయిన తర్వాత రాజ్యసభ సభకు వెళ్ళేట్లుగా మాటలు జరుగుతున్నాయని సమాచారం. ఒంగోలు లోక్ సభకు పురంధేశ్వరి పోటీ చేస్తే అదే పరిధిలోకి పర్చూరు కూడా వస్తుంది. కాబట్టి ఇద్దరికీ సమన్వయం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి పురంధేశ్వరి వైసిపిలో చేరే విషయం ఏమవుతుందో చూడాలి.