ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరిగిన నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. టీఆర్ఎస్ ని ఓడించేందుకు టి కాంగ్రెస్, టిడీపి,టిజెఎస్,సిపిఐ తో పొత్తుపెట్టుకొని మహాకూటమిగా ఏర్పడినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ నాయకులకే పట్టం కట్టారు. అయితే ఏపి సీఎం చంద్రబాబు తెలంగాణలోప్రచారానికి రావడం జరిగింది. ఇప్పుడు ఏపిలో తమ జోక్యం తప్పకుండా ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్న విషయం తెలిసింది. ఈ మద్య వైఎస్ జగన్ ఇంటికి కేటీఆర్ వెళ్లి మంతనాలు కూడా చేశారు.
ఇప్పుడు పవన్ కళ్యాన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం మరో సంచలనానిక తెరలేపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోంలో కేసీఆర్-పవన్ మంతనాలు జరిపి మరింత గందరగోళానికి తెరతీశారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం ఏపీకి వెళ్లి జగన్తో చర్చిస్తానన్న కేసీఆర్ అంతకంటే ముందే పవన్తో మంతనాలు జరిపి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కేసీఆర్ గురించి పవన్కు ఫుల్ క్లారిటీ ఉందని, కాబట్టి ఆయన ఉచ్చులో జనసేనాని పవన్ పడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు నిజంగా సమదూరం పాటిస్తున్న పవన్ కళ్యాణ్ను ఏదో రకంగా వివాదంలోకి లాగేందుకు టీఆరెస్ కూడా ప్రయత్నం చేస్తోందని ట్విట్టర్ వేదికగా రాములమ్మ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి-అఖిలేశ్ యాదవ్ కలవగా లేనిది పవన్-చంద్రబాబు కలిస్తే తప్పేంటని టీడీపీ నేతలు అంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర ఫ్రంట్లు ఏర్పాటు చేయడం కంటే వైసీపీ-జనసేనలను ఒకవేదిక మీదకు తీసుకు రావడాన్నే ఆయన అజెండాగా పెట్టుకున్నారన్న అనుమానం వస్తోందన్నారు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యాన్ని వద్దనుకున్న కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని, అటువంటి కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ జిత్తుల గురించి పవన్కు బాగానే క్లారిటీ ఉండి ఉంటుందని అన్నారు. కేసీఆర్ ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా పవన్ మాత్రం అంత త్వరగా ఆయన ఉచ్చులో పడకపోవచ్చని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. విజయశాంతి వ్యాఖ్యలపై పవన్ నుంచిగానీ టీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది.