రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడం కష్టం. ఒకే పార్టీలో ఉంటూ కత్తులు నూరుకున్న నాయకుల మధ్య ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు తెరమీదికి వస్తాయో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు ఇలాంటి తరహా పరిణామం ఒకటి వైసీపీలో చోటు చేసుకుంది. ఒకే పార్టీలో ఉంటూ.. ఒకే జిల్లా నేతలుగా ఉంటూ కూడా ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు. ఈ ఇద్దరికీ వైసీపీ అధినేత జగన్తో నేరుగా సంబంధాలు కూడా ఉన్నాయి. వైవీతో ఏకంగా కుటుంబ పరమైన సంబంధాలుంటే.. బాలినేనితో స్నేహం ఉంది. దీంతో జగన్కు ఇద్దరూ కావాల్సి న వారే.
అయితే, ఈ ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లాలో మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేం దుకు అనేక విధాల పోటీ పడ్డారు. బాలినేని హవా తగ్గించేందుకు వైవీ చేయని ప్రయత్నం లేదు. ఆయనను కేవలం ఒంగోలు వరకే పరిమితం చేయాలని వైవీ అనేకసార్లు ప్రయత్నించారు. అదేసమయంలో బాలినేనికి మద్దతు పలికే వారిని సమన్వ యకర్తల పోస్టులను తొలగించేలా చేసి వైవీ తన కసి తీర్చుకున్నారు. కొండపిలో ఇదే జరిగింది. దీంతో ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరూ మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అనేక మార్గాలు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలినేని కూడా వైవీకీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనను వ్యూహాత్మకంగా ఒంగోలు ఎంపీ బరి నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందని అంటున్నారు.
తాజాగా జరిగిన విషయాన్ని పరిశీలిస్తే.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పట్టు పెంచుకుని ఇక్కడ నుంచి గతంలో గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి .. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకొంటున్నట్టు రెండేళ్ల కిందటే వెల్లడించారు. దీనికి వ్యక్తిగత కారణాలను ఆయన తెరమీదికి తెచ్చారు. మరి దర్శి వంటి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేయనని చెప్పిన బూచేపల్లిని బాలినేని దువ్వారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ బరి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బాలినేని తాజాగా వెల్లడించారు. దర్శిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా ఈ విషయాన్ని బాలినేని ప్రకటించడం పార్టీలో సంచలనంగా మారింది.
ఇటీవల ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలకు వైసీపీ అధినేత జగన్ కొత్త సమన్వయ కర్తలను నియమించారు. వీరినిస్థానిక కేడర్కు పరిచయం చేసే కార్యక్రమం ఇటీవల నిర్వహించారు బాలినేని., ఈ సందర్భంగా ఆయన బూచేపల్లిని ఆహ్వానించారు. ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో బూచేపల్లి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని, జగన్ కు బూచేపల్లి అత్యంత సన్నిహితుడని బాలినేని వెల్లడించారు. మరి ఇదే నిజమైతే.. ఖచ్చితంగా వైవీకి చెక్ పెట్టినట్టే అవుతుంది. ఇది ఎలా ఉన్నప్పటికీ.. బాలినేని ప్రకటనతో పార్టీలోని వైవీ బాధితులు మాత్రం పండగ చేసుకోవడం గమనార్హం.