జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గుంటూరు ఎంపీ స్థానం విషయంపై తాజాగా చర్చ జరుగుతోంది. రాజధాని జిల్లాలో అత్యంత కీలకమైన ఈ టికెట్ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కమ్మసామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి సూపర్ స్టార్ మహేష్ బావ గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈయనకు దీటుగా ఇక్కడ వైసీపీ కూడా రాజకీయాలు ముమ్మరం చేస్తోంది. అయితే, ఇక్కడ నుంచి జనసేనాని పవన్ తాజాగా తోట చంద్రశేఖర్ పేరు ప్రకటించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. ఈ పరిణామంతో మరోసారి గుంటూరు ఎంపీ స్థానంపై చర్చ ప్రారంభమైంది.
ఇక,చంద్రశేఖర్ విషయానికి వస్తే.. ఈయన మహారాష్ట్ర కేడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2014 లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు కూడా ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరవాత చంద్రశేఖర్ వైసీపీని వీడి జనసైనికుడిగా మారారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కల తేల్చేందుకు పవన్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ (జేఎఫ్సీ)లో సభ్యుడిగా కూడా ఉన్నారు.
అయితే, ఎవరూ ఊహించని విధంగా పవన్ ఆయన పేరును గుంటూరు ఎంపీ స్థానానికి ప్రకటించడంతో ఆయన గెలుస్తారా? అనే చర్చ ప్రారంభమైంది. నిజానికి ఇక్కడ గల్లాకు బలం ఎక్కువగా కనిపిస్తోంది. పోనీ ఈయనను పక్కన పెట్టినా వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ వైసీపీ తరఫున ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులను సైతం జగన్ తప్పించి.. నరసరావుపేటకు మార్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ భారీ ఎత్తున పోటీ నెలకొందన్న విషయం తెలిసిందే. మరోమాట ఏంటంటే.. ఇదే టికెట్ కోరుకున్న ఘట్టమనేని ఆదిశేషును కూడా జగన్ వదులుకున్నారు. అంటే ఇక్కడ నుంచి గట్టి పోటీ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ముక్కు మొహం తెలియని చంద్రశేఖర్ను నిలబెట్టి పవన్ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కగలడా అనేది ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.