ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రజా సంకల్ప యాత్ర ముగించిన విషయం తెలిసిందే. ఏపిలో వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. టీడీపీ, వైసీపీ,జనసేన ముఖ్యనేతలు దూకుడు పెంచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అధికార పార్టీ తాము చేస్తున్న అభివృద్ది పనులు తమను ఖచ్చితంగా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పక్ష నేతలు మాత్రం ఈ నాలుగేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఇక పవన్ కళ్యాన్ వైసీపీ, టీడీపీ లపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నలభైఏళ్ల వైఎస్ జగన్ పథకాల్ని కాపీ కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్ల మండలంలోని తెలికిచెర్ల గ్రామంలో ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో పాల్గొన్న ఫైర్ బ్రాండ్ రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డీబార్ చేస్తుంటారు. మరి వైఎస్సార్సీపీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి అని రోజా ప్రశ్నించారు. అంతే కాదు చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటోడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది ఎప్పటికైనా మనిషికి ప్రమాదం అని అన్నారు. వైఎస్ జగన్ అప్డేటెడ్ వెర్షన్ అయితే బాబు ఔట్ డేటెడ్ వెర్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు..జాబు లేదు..బాబు రాలేదు. చంద్రబాబు తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.పెంచిన పెన్షన్ 2వేల రూపాయలను బాబు రెండు నెలలు మాత్రమే ఇస్తాడన్నారు. అదే జగన్కు ఓటువేస్తే జీవితాంతం ఇస్తాడని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.